Pranay : క్వార్టర్స్కు ప్రణయ్
ABN , First Publish Date - 2023-06-23T00:47:46+05:30 IST
భారత ఏస్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లాడు.
• కశ్యప్, సిక్కి జోడీ అవుట్
• తైపీ ఓపెన్
తైపీ: భారత ఏస్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో మూడో సీడ్ ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై వరుస గేముల్లో నెగ్గాడు. తొలి గేమ్ ఆరంభం నుంచే ప్రణయ్ దూకుడు కనబర్చాడు. 1–1తో ఉన్నప్పుడు వరుసగా ఏడు పాయింట్లు సాధించిన ప్రణయ్ 8–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం ఇవ్వకుండా పదునైన స్మాష్లతో విరుచుకుపడిన ప్రణయ్ మొదటి గేమ్ను అలవోకగా తన ఖాతాలో వేసుకొన్నాడు. అయితే, రెండో గేమ్ ఆరంభంలో భారత షట్లర్ కొంత తడబడినా ఆ తర్వాత జోరు ప్రదర్శించాడు. రౌండ్–8లో అంగస్ ఎన్జీ క లాంగ్ (ఇండోనేసియా)తో ప్రణయ్ తలపడనున్నాడు. వెటరన్ పారుపల్లి కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ చేతిలో, తన్య హేమంత్ 11–21, 6–21తో టాప్ సీడ్ తై జు యింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జంట 13–21, 18–21తో చిచు సియాంగ్ చియా–లిన్ జియో మిన్ చేతిలో చిత్తయింది.