Bumrah : బుమ్రా.. ముంబైకి కటీఫ్ చెబుతాడా?
ABN , First Publish Date - 2023-11-29T05:32:07+05:30 IST
ఐపీఎల్లో పదేళ్లుగా ముంబై ఇండియన్స్ ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టుతో బంఽధానికి ముగింపు పలకనున్నాడా? అంటే.. ప్రస్తుత పరిణామాలు చూస్తే
ముంబై: ఐపీఎల్లో పదేళ్లుగా ముంబై ఇండియన్స్ ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టుతో బంఽధానికి ముగింపు పలకనున్నాడా? అంటే.. ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా అతడు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ముంబై జట్టును అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు బుమ్రా.. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే అత్యుత్తమ సమాధానం’ అని మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్టయింది. క్రికెట్ వర్గాల ప్రకారం.. రోహిత్ తర్వాత ముంబై జట్టుకు కెప్టెన్ అవుదామని బుమ్రా అనుకొన్నాడట. కానీ, ముంబై హార్దిక్ పాండ్యాను తిరిగి తీసుకోవడంతో బుమ్రా తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. రెండేళ్ల క్రితం బుమ్రాను రూ. 12 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంది. బుమ్రా ముంబైని వీడాలనుకుంటే, వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో అతనికి భారీ ధర పలికే అవకాశముంది.