ఖాళీగా దర్శనమిచ్చిన పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు
ABN , First Publish Date - 2023-12-03T03:54:10+05:30 IST
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు కొన్ని ఖాళీగా కనిపించడం కలకలం రేపింది.
ఇబ్రహీంపట్నంలో పలు పార్టీల కార్యకర్తల నిరసన
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు కొన్ని ఖాళీగా కనిపించడం కలకలం రేపింది. నవంబరు 29 వరకు వివిధ నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ శిక్షణ తీసుకున్న అనంతరం పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. అధికారులు వాటిని ఆయా నియోజకవర్గాలకు చేరవేసి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ పేపర్లను సీజ్ చేసి ఓ గదిలో భద్రపరిచారు. శనివారం రాత్రి అధికారులు స్ట్రాంగ్ రూంను తెరిచారు. అదే సమయంలో మరో గదిలో ఇబ్రహీంపట్నం పేరుతో ఉన్న కొన్ని పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు ఖాళీగా కనిపించడటంతో కాంగ్రెస్, వివిధ పార్టీల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. పార్టీల ఏజెంట్లు లేకుండానే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కనుసన్నల్లో గోల్మాల్ జరిగిందని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్ భారతీ హోళీకేరి, ఎన్నికల అబ్జర్వర్ నినామా వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించిన తర్వాతనే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు రామ్ రెడ్డి మీడియాకు తెలిపారు.