జొన్నల సేకరణకు సర్కార్ గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2023-05-13T02:39:52+05:30 IST
రాష్ట్రంలో యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్నలను కనీస మద్దతు ధరకు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్నలను కనీస మద్దతు ధరకు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం ఆదేశాలమేరకు తెలంగాణ స్టేట్ మార్క్ఫెడ్ను జొన్నల సేకరణకు నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్క్ఫెడ్ ఎండీ యాదిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 1,26,926 ఎకరాల్లో జొన్న(హైబ్రిడ్) సాగుచేశారు. ఎకరానికి 5.16 క్వింటాళ్ల చొప్పున 65,494 మెట్రిక్ టన్నుల జొన్నల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొత్తం జొన్నల కొనుగోలుకు రూ. 219.92 కోట్ల నిధులు అవసరం అవుతాయని, వీటికి ‘బ్యాంకు గ్యారెంటీ’ ఇస్తున్నట్లు శుక్రవారం జారీచేసిన జీవో ఆర్టీ నెంబరు- 197లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్ ఫీజుకు మినహాయింపు ఇవ్వటంతోపాటు ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో ఏమైనా నష్టాలువస్తే రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్కు రీ- ఎంబర్స్మెంట్ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.ఎ్ఫఏక్యూ(ఫేర్ యావరేజ్ క్వాలిటీ) ప్రకారం.. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,970 చొప్పున కొనుగోలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో జొన్న పంట పండించిన రైతులకు మేలు కలుగనుంది. జొన్నల కొనుగోళ్లకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్కు తెలంగాణ స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.