Share News

Mridula Mukherjee : చరిత్ర ఒక సత్యం

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:49 AM

‘చరిత్ర ఒక సత్యం. గత కాలపు వాస్తవాలకు ప్రతిబింబం. మన జీవన విధానం, నాగరికత, వారసత్వం, పారంపర్యతలను తెలుసుకోవడానికి సరైన సాధనం చరిత్రే’ అని ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్‌ మృదుల ముఖర్జీ చెప్పారు.

 Mridula Mukherjee : చరిత్ర ఒక సత్యం

అంత ప్రాముఖ్యత కలిగిన రంగం విస్మరణకు, వక్రీకరణకు గురవుతోంది

యువతకు డబ్బే లోకమై పోయింది

సామాజిక శాస్త్రాలు అటకెక్కాయి

దీంతో భవిష్యత్తులో దుష్పరిణామాలు

చరిత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించాలి

వరంగల్‌కు వస్తే చరిత్రలోకి నడిచి వెళ్తున్నట్టుగా ఉంది

‘ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌’

మాజీ అధ్యక్షురాలు మృదుల ముఖర్జీ

హనుమకొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘చరిత్ర ఒక సత్యం. గత కాలపు వాస్తవాలకు ప్రతిబింబం. మన జీవన విధానం, నాగరికత, వారసత్వం, పారంపర్యతలను తెలుసుకోవడానికి సరైన సాధనం చరిత్రే’ అని ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్‌ మృదుల ముఖర్జీ చెప్పారు. గతానికి పునాది చరిత్ర అయితే, ఆ చరిత్ర ఆలంబనగానే మానవుడి వర్తమాన జీవనపథం ఉంటుందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 28వ తేదీ నుంచి జరుగుతున్న ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ 82వ వార్షిక సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన మృదుల ముఖర్జీ.. ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..

ఈ సాంకేతిక యుగంలో చరిత్ర ఉనికికి ప్రమాదం ఏర్పడిందంటున్నారు. నిజమేనా?

నిజమే. చరిత్ర దారుణంగా విస్మరణకు గురవుతోంది. వక్రీకరణకు లోనవుతోంది. యువత ఉపాధి వేటలో పడి ఐటీ, ఇంజనీరింగ్‌ తదితర సాంకేతిక కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. డబ్బు సంపాదనే లోకమైంది. తమ చుట్టూ ఉన్న సమాజపు పరిణామాలను పట్టించుకోవడం మానేశారు. సామాజికశాస్త్ర అధ్యయనం దాదాపు అటకెక్కింది. ఇది బాధాకరమైన పరిణామం. దీనివల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. సామాజిక నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి, నాయకుల కుత్సితత్వం, తల్లిదండ్రుల ఆలోచన కూడా చరిత్ర విస్మరణకు ప్రధాన కారణాలు. చరిత్ర ప్రాముఖ్యత పట్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. అన్వేషణ, అధ్యయనం దిశగా ప్రోత్సహించాలి.

హిస్టరీని ఎంచుకుంటే ఉపాధి అవకాశాలు లేవన్న భావన ఉంది కదా?

ఈ అభిప్రాయం తప్పు. వేటిలోనూ ఉపాధి అవకాశాలు వాటంతట అవే పుట్టుకురావు. అవసరాన్ని బట్టి ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది. ఐటీ, ఇంజనీరింగ్‌లను బాగా ప్రోత్సహించడం వల్లనే అవసరాలు ఏర్పడి ఉద్యోగావకాశాలు పుట్టుకువచ్చాయి. చరిత్ర విషయంలోనూ అంతే. తగిన విధంగా ప్రోత్సహిస్తే చరిత్రను ఎంచుకున్నవారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఒక చరిత్రకారిణిగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై మీ కామెంట్‌?

చరిత్ర వేరు. మతం వేరు. చరిత్ర సార్వజనీనం. మతం వ్యక్తిగతం. రామమందిరం కార్యక్రమం ప్రజలకు సంబంధించింది. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదు. వ్యక్తిగతంగా సాధారణ పౌరులుగా హాజరుకావచ్చు.

చరిత్ర వక్రీకరణలపై మీ అభిప్రాయం?

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్ర వక్రీకరణలు జరుగుతుంటాయి. కానీ నిజమైన చరిత్రకారులు ఇవేమీ పట్టించుకోవద్దు. నిత్య సత్యాన్వేషిగా ఉండాలి. చరిత్రలో మరుగుపడిన వాస్తవాలను నిజాయితీగా, నిబద్ధతతో వెలుగులోకి తీసుకురావాలి.

చరిత్ర పరిరక్షణకు ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

80 ఏళ్లుగా చరిత్రను పరిరక్షించడం, మరుగునపడిన వాస్తవాలను వెలికితీయడం, కొత్తసత్యాలను అన్వేషించడం, చరిత్రను అన్ని కోణాల నుంచి శోధించడంలో అద్వితీయమైన పాత్రను పోషిస్తోంది. ఏటా సదస్సులు నిర్వహించడం ద్వారా ఔత్సాహిక యువ చరిత్రకారులను ప్రోత్సహిస్తున్నాం. దేశ చారిత్రక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నఏకైక వేదిక ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌.

ఓరుగల్లు నగరానికి రావడం పట్ల మీ అనుభూతి?

గతంలో రెండు మూడుసార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా ఇక్కడి చరిత్ర నన్ను అక్కున చేర్చుకున్నట్టు ఉంటుంది. కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన ప్రాచీన కట్టడాలు చూస్తుంటే చరిత్రలోకి నడిచి వెళుతున్నట్టు ఉంటుంది. ఓరుగుల్లు చారిత్రకంగా ఓ అద్భుతమైన ప్రాంతం.

Updated Date - Dec 30 , 2023 | 04:00 AM