ఆదాయం ఫుల్‌.. ఆదా నిల్‌

ABN , First Publish Date - 2023-02-13T00:40:34+05:30 IST

స్వయంభువుగా వెలిసి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మేళ్లచెర్వు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయానికి రంగు వేయాలన్నా.. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామసేవ నిర్వహించాలన్నా.. విశిష్ట రోజుల్లో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేయాలన్నా దాతల సహకారం కావాల్సిందే. పాలకవర్గం అనాలోచిత నిర్ణయాల కారణంగా కోట్ల రూపాయల విలువైన భూములకు అధిపతైనా స్వామివారి సేవల కోసం దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదాయం ఫుల్‌.. ఆదా నిల్‌

మేళ్లచెర్వు ఆలయంలో అనధికార పెత్తందారులు

ప్రతీ పనికి దాతల వైపే చూపు

ఈ నెల 18నుంచి ఐదు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వు: స్వయంభువుగా వెలిసి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మేళ్లచెర్వు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయానికి రంగు వేయాలన్నా.. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామసేవ నిర్వహించాలన్నా.. విశిష్ట రోజుల్లో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేయాలన్నా దాతల సహకారం కావాల్సిందే. పాలకవర్గం అనాలోచిత నిర్ణయాల కారణంగా కోట్ల రూపాయల విలువైన భూములకు అధిపతైనా స్వామివారి సేవల కోసం దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 18వ తేదీ నుంచి 22 వరకు ఐదు రోజులపాటు శివరాత్రి మహోత్సవాలు కొనసాగనున్నాయి.

మేళ్లచెర్వు రెవెన్యూ పరిధిలో శంభులింగేశ్వర స్వామి ఆలయం పేరున సర్వేనెంబ ర్‌ 872లో 38ఎకరాలతో పాటు మొత్తం 50ఎకరాల భూమి ఉండేది. నేటికీ ఆ భూములున్న ప్రాంతాన్ని శంభుడి మాన్యం పేరుతో పిలుస్తారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వాటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. అయితే ఈ భూములను ఇతరులు ఆక్రమిస్తున్నారని, వాటికి రక్షణ లేదని భావించిన అధికారులు వాటిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని 1984-86 ప్రాంతంలో 48 ఎకరాల ను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. అది పోగా ప్రస్తుతం రెండు ఎకరాల భూమి మాత్రమే దేవుని మాన్యంగా మిగిలింది. అయితే 48 ఎకరాలను విక్రయించగా వచ్చిన రూ.9లక్షలను నాడు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. వాటికి వడ్డీగా రూ.6.50లక్షలు రాగా, ప్రస్తుతం మొత్తం కలిపి స్వామివారి పేరున బ్యాంకుల్లో రూ.15లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇది స్వామి కైంకర్యాల నిర్వహణకు సరిపోకపోవడంతో వాటిని అలాగే ఉంచి ఆలయ అధికారులు దాతల సహకారంపైనే ఆధారపడుతున్నారు.

ఆదాయం ఉన్నా

స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఐదు రోజుల్లో సుమారు 5లక్షల నుంచి 6లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల దర్శనం టికెట్లు, ఇతర సేవా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో కొంతమంది అనధికారికంగా పెత్తందారులుగా కొనసాగుతుండటం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుందనే విమర్శలు ఉన్నాయి. వారికి ఆలయానికి ఎలాంటి సంబంధం లేకున్నా, అనువంశిక ధర్మకర్తలు, అధికారులు కాకున్నా, ఆలయంలో వీరికి రాచమర్యాదలు కొనసాగుతున్నాయి. ఆలయంపై, భక్తులపై వీరు పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.

జాతర పేరుతో గోల్‌మాల్‌

జాతరలో వినోదం కోసం ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌కు అన్నిరకాల అనుమతులు ఒకే వ్యక్తికి నామమాత్రపు రుసుముకు కట్టబెడుతున్నారు. ఇతరులు ముందుకు వచ్చినా అధికారులు అవకాశం ఇవ్వడం లేదు. పోటీ లేకపోవడంతో అధిక చార్జీ వసూలు చేస్తున్నట్టు భక్తులు ఏటా ఆరోపిస్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం వీఐపీలను మాత్రమే ఆలయ ధర్మకర్తలు సత్కరించాలి. దీనికి విరుద్ధంగా పాలకులు, అధికారులు వారు అనుకున్నవారికి ఆలయ మర్యాదలు చేసి ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక్క మహాశివరాత్రి ఐదురోజుల్లో స్వామివారి పట్టువస్త్రాలతో పాటు శాలువాలకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

ఎక్కడా అవినీతి లేదు : గుజ్జుల కొండారెడ్డి, ఆలయ ఈవో

నేను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండో జాతర నిర్వహిస్తున్నాం. గతంలో ఎటువం టి లోపాలు జరగలేదు. ఏవైనా ఉంటే సరిచేసుకుంటాం. ఎక్కడా అవినీతి లేదు, అంతా పారదర్శకమే. పాలక మండలి అనుమతితో నిర్ణయాలు తీసుకుంటాం. ఆలయంలో అభివృద్ధి నిరంత రం కొనసాగుతోంది. ఆలయానికి సహకారం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

Updated Date - 2023-02-13T12:11:50+05:30 IST