ఓటమి భయంతోనే కేసీఆర్, కేటీఆర్ బాబును కలవాలనుకున్నారు
ABN , First Publish Date - 2023-11-29T03:51:23+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్..
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు
కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు
కాంగ్రెస్ వైపు టీడీపీ అభిమానులు వచ్చారు
అందుకే బాబును కలవాలనుకున్న కేసీఆర్
తుమ్మల తులసి మొక్క.. పువ్వాడ
గంజాయి మొక్క: సీపీఐ నారాయణ
ఖమ్మం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక పరామర్శ పేరుతో ఆయన్ను కలవడానికి ప్రయత్నించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదని చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరం బాలప్పేట, ఖమ్మం రూరల్ మండలం సాయిగణే్షనగర్లో నిర్వహించిన కార్యక్రమాలు, విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన అభిమానులు ధర్నాలు, నిరసనలు చేస్తుంటే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, వారి మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. దీంతో టీడీపీ, చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ అభిమానులు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గమనించిన కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబును కలవడానికి ప్రయత్నించారన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్, వామపక్షాలు, లౌకిక శక్తులు బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తుంటే కేసీఆర్, మోదీ, జగన్మోహన్రెడ్డి కలిసి పనిచేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సీఎంలు మోదీతోనే ఉన్నారని నారాయణ ఆరోపించారు. కేసీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావును తుమ్మ ముళ్లుగా పోల్చారని.. కానీ తుమ్మల తులసి మొక్కలాంటివాడని నారాయణ కితాబిచ్చారు. కానీ, పువ్వాడ అజయ్కుమార్ గంజాయి మొక్కలాంటివాడని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా మారారని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో 78-82 సీట్లలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని, ఆ తర్వాత వెంటనే రైతుబంధును ఎకరాకు రూ.7,500కు పెంచి రైతుల ఖాతాల్లో జమచేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచి పదికి పది సీట్లలో తమదే విజయమని స్పష్టంచేశారు.