Share News

అప్పులు కాదు.. ఆస్తులు పెంచాం!

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:26 AM

పదేళ్ల పాలనలో తాము ఆస్తుల్ని పెంచామని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. గత ప్రభుత్వం తెలంగాణను తీవ్ర అప్పుల్లోకి నెట్టివేసిందంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ వేదికగా చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది.

అప్పులు కాదు.. ఆస్తులు పెంచాం!

విద్యుత్‌ సంస్థల ఆస్తులు రూ.93 వేల కోట్ల మేర పెంపు.. తలసరి ఆదాయంలో 151.7ు పెరుగుదల నమోదు

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో తాము ఆస్తుల్ని పెంచామని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. గత ప్రభుత్వం తెలంగాణను తీవ్ర అప్పుల్లోకి నెట్టివేసిందంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ వేదికగా చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది. తాము చేసింది అప్పులు కాదని.. ఆస్తుల్ని పెంచామని వెల్లడించింది. ఈ మేరకు ‘10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు’ పేరిట బీఆర్‌ఎస్‌ బుధవారం ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆయా రంగాల్లో ఉన్న పరిస్థితులు, రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ చేసిన ఖర్చులు, సాధించిన విజయాల్ని పొందుపర్చారు.

బుక్‌లెట్‌లో వివరాలు..

ప్రత్యేక రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు. 30 జిల్లాల్లో రూ.1649.62 కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం. 2014లో రాష్ట్రం ఏర్పడక ముందు 52 మునిసిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 128, 13కు పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 8,578 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. చెత్త సేకరణకు 2548 వాహనాలు ఉంటే వాటిని 4713కు పెంచాం. 293 గురుకులాలను 1022కు పెంచాం. మన ఊరు, మన బడి కార్యక్రమంలో కొత్త బడుల నిర్మాణానికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయడం వల్ల 23,37,654 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఆలయాల అభివృద్ధికి రూ.2800 కోట్లు ఖర్చు చేస్తే 1200 కోట్లు యాదాద్రికే అయింది. ఆరోగ్య తెలంగాణ కోసం ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, ఆక్సిజన్‌ పడకలు ఐసీయూ కేంద్రాలు పెంచినట్లు నట్లు బీఆర్‌ఎస్‌ వెల్లడించింది. వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం. 2014కు ముందు 3 మెడికల్‌ కాలేజీలు ఉంటే ఇప్పుడు 33 ఉన్నాయి. రూ.585 కోట్లతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం, 137 పోలీస్‌ భవనాల నిర్మాణం. రూ.654.50 కోట్లతో కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల నిర్మాణం. పదేళ్లలో 10.13 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు. పోలీస్‌ వాహనాల సంఖ్య 20,115కు పెంపు.

విద్యుత్‌ సంస్థల్లో ఆస్తులు..

2014లో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 19,464 మెగావాట్లకు పెరిగింది. సౌర విద్యుత్తు 74 నుంచి 5,741 మెగావాట్లకు పెరిగింది. గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 5,661 మెగావాట్ల నుంచి 15,497 మెగావాట్లకు చేరింది. విద్యుత్తు సంస్థల అప్పులు 2014లో రూ.22,423 కోట్లు ఉంటే 2023లో రూ.81 వేల కోట్లకు చేరాయి. ఆస్తులు రూ.44,431 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1,37,571 కోట్లకు పెరిగాయి. మొత్తం అప్పుల్లో పెరుగుదల రూ.59 వేల కోట్లు కాగా.. ఆస్తుల పెరుగుదల రూ.93 వేల కోట్లకు చేరిందని బుక్‌లెట్‌లో తెలిపింది. ఇంకా, రూ.617 కోట్లతో సచివాలయ నిర్మాణం, రూ.146 కోట్లతో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు, రూ.178 కోట్లతో అమరుల చిహ్నం నిర్మించామని, తలసరి ఆదాయంలో 151.7ు పెరుగుదల నమోదైందని బీఆర్‌ఎస్‌ వెల్లడించింది. తెలంగాణ చేసిన ప్రతి రూపాయి అప్పునకు రూ.వెయ్యి ఆస్తి కూడబెట్టినట్లు తెలిపింది.

Updated Date - Dec 21 , 2023 | 05:26 AM