హద్దులు దాటొద్దు
ABN , First Publish Date - 2023-03-18T00:09:17+05:30 IST
సరిహద్దుగా ఉన్న కాగ్నానదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని బషీరాబాద్ తహసీల్దార్ ఎన్.వెంకటస్వామి కన్నడిగులను హెచ్చరించారు.
తెలంగాణ కాగ్నానదిలో ఇసుకను తరలిస్తే చర్యలు
బషీరాబాద్ తహసీల్దార్ వెంకటస్వామి
బషీరాబాద్, మార్చి 17: సరిహద్దుగా ఉన్న కాగ్నానదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని బషీరాబాద్ తహసీల్దార్ ఎన్.వెంకటస్వామి కన్నడిగులను హెచ్చరించారు. నవాంద్గీ సమీపంలో తెలంగాణ-కర్ణాటక హద్దుగా ఉన్న కాగ్నానదిలో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్లు అనుమతుల పేరిట ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుకెళ్తున్నారనే సమాచారంతో ఎస్ఐ విద్యాచరణ్రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. సరిహద్దుగా ఉన్న నదీ పరివాహక పరిసార ప్రాంతాన్ని ఆయన కలియతిరిగి హద్దులు గుర్తించారు. అక్కడున్న కన్నడిగులతో తహసీల్దార్ అనుమతుల విషయమై చర్చిస్తూ ఇసుక తవ్వకాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. నది మధ్యలో కన్నడిగులు వెసిన తాత్కలిక రోడ్డును తహసీల్దార్ గుర్తించి వెంటనే ఆ రోడ్డును ఎక్స్కవేటర్తో తొలగింపజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వీఆర్ఏలతో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపకుండా చర్యలు చేపడతామన్నారు. హద్దులు దాటి తెలంగాణ కాగ్నానది పరిధిలోని ఇసుకను తరలిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.