నీరు తాగేందుకు వెళ్తే.. గుంజీలు తీయించిన ఉపాధ్యాయిని

ABN , First Publish Date - 2023-03-16T00:41:09+05:30 IST

దాహం వేసి నీరు తాగేందుకు వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయురాలు గుంజీలు తీయించిన ఘటన పట్లూర్‌ జడ్పీ పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది.

నీరు తాగేందుకు వెళ్తే.. గుంజీలు తీయించిన ఉపాధ్యాయిని
విద్యార్థితో గుంజీలు తీయిస్తున్న ఉపాధ్యాయురాలు

మర్పల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): దాహం వేసి నీరు తాగేందుకు వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయురాలు గుంజీలు తీయించిన ఘటన పట్లూర్‌ జడ్పీ పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 7వ తరగతిలో టీచర్‌ లేని సమయంలో దాహం వేసిన విద్యార్థులు కొందరు స్కూలు ప్రాంగణంలోనే ఉన్న కుండ వద్దకు వెళ్లి నీరు తాగారు. వారు తిరిగి క్లాస్‌కు వస్తుండగా పక్క రూంలో ఉన్న ఉపాధ్యాయురాలు చూసి.. టీచర్‌ను అడగకుండా నీరు తాగేందుకు ఎలా వెళ్తారని ఆగ్రహించి ఏడుగురు విద్యార్థులను 50చొప్పున గుంజీలు తీయించారు. విషయం తెలిసి గ్రామస్తులు స్కూలుకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. నీళ్లు తాగేందుకు వెళ్తే గుంజీలు తీయిస్తారా? అని అడిగారు. ‘దాహం వేస్తే ఇంటర్వెల్‌ లేదా? భోజన సమయంలోనే నీరు తాగాలి. చీటికీ మాటికి బయటకు వెళ్తే ఇలానే శిక్షిస్తాం.’ అని ఉపాధ్యాయిని గ్రామస్తులతో అన్నారు. ఎండలు ఉన్నందున దాహం వేసి పిల్లలు నీటి కోసం వెళ్లి ఉంటారని, క్లాస్‌లో టీచర్‌ లేకనే ఎవర్నీ అడగలేదని గ్రామస్తులు చెప్పినా ఆ టీచర్‌ విన్పించుకోలేదు. నీరు తాగేందుకు వెళ్తే గుంజీలు తీయించాలా? అని గ్రామస్తులు ప్రశ్నించారు. ‘బరాబర్‌ ఇలాగే చేస్తా.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకే గుంజీలు తీయించా.’ అంటూ సదరు ఉపాధ్యాయురాలు గ్రామస్తులతో అనడం గమనార్హం.

Updated Date - 2023-03-16T00:41:09+05:30 IST