Chandrababu arrest: తడబడి.. సీఐడీ !

ABN , First Publish Date - 2023-09-15T04:31:31+05:30 IST

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు సీఐడీ నానా అగచాట్లు పడుతోంది.

Chandrababu arrest: తడబడి.. సీఐడీ !

హైదరాబాద్‌లో సీఐడీ చీఫ్‌ ‘ఫ్లాప్‌ షో’

(హైదరాబాద్‌, అమరావతి - ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు సీఐడీ నానా అగచాట్లు పడుతోంది. పదేపదే అవే ఆరోపణలు చేయడమే తప్ప.. వాటికి ఆధారాలేమిటో చూపలేక పోతోం ది. ఏపీలో పోయిన పరువు చాలదన్నట్లు... గురువారం హైదరాబాద్‌లోనూ ప్రెస్‌మీట్‌ పెట్టి, మీడియా ప్రశ్నలకు సమాధానాలివ్వలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. ‘చంద్రబాబుకు వ్యతిరేకంగా మా వద్ద స్పష్టమైన ఆధారాలేవీ లేవు’ అని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పరోక్షంగా అంగీకరించారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘షెల్‌ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో బాబుకు డబ్బులు చేరాయంటున్నారు. అదె లా జరిగింది? దానికి ఆధారాలేమిటి?’ అని ప్రశ్నిస్తే... ‘‘రిమాండ్‌కు పంపించిన దశలో ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎలా! రెండు నెలల తర్వాత చార్జిషీట్‌ వేసే సమయంలో అడగండి. షెల్‌ కంపెనీల నుంచి నిధులు ఎవరికి వెళ్లాయి? వాటి ఖాతాలు, తీసుకున్నవారెవరు, క్యాష్‌ తీసుకొని ఇంటికి వెళ్లిన రోజు, ఇతర ఫోటోలు అన్నీ తెలియాలంటే మరింత విచారణ జరగాలి.


ఇందుకు చాలా చాలా సమయం పడుతుంది’’ అని సంజయ్‌ చెప్పారు. ‘రెండు నెలల తర్వాతైనా చెప్పాల్సిందే కదా! అదేదో ఇప్పుడే చెప్పండి. ఎలాగూ ప్రెస్‌మీట్‌ పెట్టారు కదా! చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయా?’’ అని ప్రశ్నించగా... సంజయ్‌ నవ్వుతూ, ‘‘రెండు నెలలంటే రెండు నెలలు కాదు. ఎక్స్‌ నెలలు అనుకోండి’’ అంటూ అసలు విషయాన్ని దాటవేశారు. 2021లో, డిజైన్‌టెక్‌ కంపెనీ జీఎస్టీ రీఫండ్‌ కేసులో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు ఇచ్చిన ప్రెస్‌నోట్లు, ట్విటర్‌లో అవి చేసిన ట్వీట్ల గురించి మాత్రం సంజయ్‌ చక్కగా ‘ప్రజెంటేషన్‌’ ఇచ్చారు. ఇదంతా ప్రైవేటు కంపెనీలు పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారం. ఇందులో చంద్రబాబు పాత్ర గురించి ఈడీ, జీఎస్టీ విభాగాలు ఏమీ చెప్పలేదు. ఆయనకు నిధులు చేరాయనీ వెల్లడించలేదు. ‘ఆ రెండు సంస్థలకు దొరకని ఆధారాలు మీకు దొరికాయా? వాటికంటే గొప్పగా మీ దగ్గర ఏ సాక్ష్యాలున్నాయని చంద్రబాబును అరెస్ట్‌ చేశారు?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా ‘‘ఆ సంస్థల విచారణ ఇంకా ముగియలేదు. మేం కూడా విచారిస్తున్నాం’’ అని చెప్పారే తప్ప సీఐడీ సాధించిందేమిటో చెప్పుకోలేకపోయారు. ఈడీ, జీఎస్టీ విభాగాలు విచారణ జరిపి అంతా చేశాకే సీఐడీ విచారణకు దిగిందని పొన్నవోలు చెప్పగా... సీఐడీ చీఫ్‌ దానిని తోసిపుచ్చుతూ ఆ సంస్థల విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పడం గమనార్హం. గంటకుపైగా సాగిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబే దోషి అని పదేపదే చెప్పారు. కానీ, అదెలాగో ఒక్క ప్రశ్నకు బదులివ్వలేకపోయారు.

Updated Date - 2023-09-15T08:58:45+05:30 IST