చిత్రపురి కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ డీసీవో అనుమతితోనే చేయాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2023-01-06T04:11:34+05:30 IST

డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ (డీసీవో) అనుమతి లేకుండా చిత్రపురి కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది.

చిత్రపురి కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ డీసీవో అనుమతితోనే  చేయాలి: హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ (డీసీవో) అనుమతి లేకుండా చిత్రపురి కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఆ కాలనీలో కేటాయింపులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పేర్కొంటూ తెలుగు సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన పలువురు సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో ఐదుగురు సభ్యుల కమిటీ చేసిన కేటాయింపులకు విరుద్ధంగా తిరిగి ఎలాంటి కేటాయింపులూ(రీ-అలాట్‌మెంట్లు) చేయరాదంటూ హౌసింగ్‌ సొసైటీకి కోఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీచేశారని.. అయినప్పటికీ చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ రిజిస్ట్రేషన్లు చేస్తోందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. సహకారశాఖ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది.. ఎలాంటి రిజిస్ట్రేషన్లూ చేయరాదని ఇప్పటికే సొసైటీ మేనేజింగ్‌ కమిటీకి ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అందరి వాదనలూ విన్న ధర్మాసనం.. డీసీవో అనుమతి లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లూ చేయరాదని ఆదేశించింది.

Updated Date - 2023-01-06T04:11:36+05:30 IST