Share News

1.70 లక్షల ఎకరాలు కొట్టేశారు

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:56 AM

జగన్‌ కేబినెట్‌లో ‘నంబర్‌ టూ’గా వెలిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా చేతిలో 15-20 వేల ఎకరాల భూమి ఉందని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు.

1.70 లక్షల ఎకరాలు కొట్టేశారు

పెద్దిరెడ్డి ముఠా చేతిలో 20 వేల ఎకరాలు

రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆరోపణ

ఒక్క పులిచర్లలోనే 970 ఎకరాలు స్వాహా

పెద్దిరెడ్డి భార్య పేరుతోహైవే పక్కన ఐదెకరాల ఆక్రమణ

మదనపల్లె ఆర్డీవో పరిధిలోని14 మండలాల్లో కబ్జాలు

అవి బయటకు రాకుండా రికార్డుల దహనం

14 వేల ఎకరాల ‘22ఏ’ ఫైళ్లు బుగ్గి: మంత్రి

అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జగన్‌ కేబినెట్‌లో ‘నంబర్‌ టూ’గా వెలిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా చేతిలో 15-20 వేల ఎకరాల భూమి ఉందని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో లక్షా 70 వేల ఎకరాల భూమిని వైసీపీ నేతలు కొట్టేశారని.. వీటి విలువ రూ.45 వేల కోట్లకుపైనేనని తెలిపారు. మొత్తం భూదోపిడీ వెలుగు చూస్తే ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. మంగళవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహ నరావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతి, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 15 నుంచి 20 వేల ఎకరాల భూమి పెద్దిరెడ్డి, ఆయన అనుయాయుల చేతిలో ఉంది. ఇవన్నీ అక్రమంగా ఆక్రమించుకున్న భూములే. పెద్ద కాంట్రాక్టర్ల వద్ద సబ్‌ కాంట్రాక్టులు చేసుకుని చిన్న కాంట్రాక్టర్‌గా జీవితం ప్రారంభించిన పెద్దిరెడ్డి ఇప్పుడు భారీగా సంపాదించారు. ఒక్క పులిచర్ల మండలంలోనే 970 ఎకరాలు కొట్టేశారు. పెద్దిరెడ్డి సతీమణి పేరుతో జాతీయ రహదారి పక్కన ఐదు ఎకరాలు ఆక్రమించారు.

చివరకు చెరువులను కూడా ఆక్రమించుకుని వాటికి పట్టాలు పుట్టించారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో వారి భూ దోపిడీ జరిగింది. మదనపల్లె ఆర్డీవో పరిధిలోని మొత్తం 14 మండలాల్లో భూకబ్జాలు చేశారు. అవి బయటపడకుండా చూడడానికే మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు తగులబెట్టారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించిన 22ఏ రికార్డులను కావాలనే దహనం చేశారు. కావలసిన వారికి భూములు కట్టబెట్టి ఎన్‌వోసీలు ఇప్పించి వాటిని కప్పిపుచ్చడానికి అగ్ని ప్రమాదం నాటకమాడారు. ఇంత దారుణంగా దోచుకోవడం వల్లే పెద్దిరెడ్డి బాధితులు వందల సంఖ్యలో వస్తున్నారు. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి’ అని మంత్రి చెప్పారు. పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ పీఎల్‌ఆర్‌కు చెందిన టిప్పర్లపై విచారణ జరపబోతున్నట్లు తెలిపారు. ఒకే నంబర్‌తో ఈ కంపెనీకి చెందిన టిప్పర్లు 2-3 తిరిగినట్లు ఫిర్యాదులు అందాయని, ఇప్పుడు వాటన్నింటినీ దాచిపెట్టారని ఆరోపించారు. భూముల రికార్డులు తగలబెట్టిన మదనపల్లెకు వైసీపీ నేత జగన్‌ వస్తానంటే ఆహ్వానిస్తామని, ఆయనకు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక బెటాలియన్‌ పోలీసులను భద్రతగా పెట్టుకుని తిరిగారని, టీడీపీ నేతలకు గన్‌మెన్‌ను తొలగించారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారం పోయాక కేవలం పది రోజుల కిందట భద్రత తగ్గిస్తే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు.

నెలకో హామీ అమలు..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెలకొకటి చొప్పున అమలు చేయాలన్నది తమ ఆలోచనని, ఆగస్టులో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆపై నెలలో ప్రారంభించే వీలుందన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 02:56 AM