చిన్న పరికరంతో 5 రకాల ఆరోగ్య పరీక్షలు
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:33 AM
విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్లో మరో కొత్త వైద్య పరికరాన్ని తయారుచేశారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరంతో ఐదు రకాల కీలక పరీక్షలు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్లో మరో కొత్త వైద్య పరికరాన్ని తయారుచేశారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరంతో ఐదు రకాల కీలక పరీక్షలు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్), రక్తపోటు (బీపీ), గుండె కొట్టుకునే వేగం (హార్ట్ రేట్), రక్తంలో ఆక్సిజన్ శాతం (ఎస్పీఓ2), ఎలక్ర్టో కార్డియోగ్రఫీ (ఈసీజీ)... ఈ ఐదింటినీ ఇంటి వద్దనే చేసుకునేలా మెడ్టెక్ జోన్లోని ‘ఆరోగ్య యంత్ర టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ చిన్న పరికరాన్ని రూపొందించింది. దీనిలోని సెన్సర్లపై వేలు పెట్టగానే ఒక్కో పరీక్ష చేసి ఫలితాలను డిస్ప్లే చేస్తుంది. ఈసీజీ కోసమైతే రెండు చేతుల బొటన వేళ్లను పెట్టి రెండు నిమిషాలపాటు పరికరాన్ని నొక్కి పట్టుకుంటే ఈసీజీ గ్రాఫ్ వస్తుంది. ఈ పరికరం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పరికరానికి అనుసంధానం చేసుకుంటే... అన్ని పరీక్షల ఫలితాలు మొబైల్లోనే రికార్డ్ అవుతాయని కంపెనీ ఎండీ కేవీ కాశ్యప్, సీటీవో ఎన్.కిరణ్కుమార్ తెలిపారు. దీనికి పేటెంట్ హక్కులు రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. ధర సుమారు రూ.16 వేలు ఉంటుందన్నారు.