Share News

పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి!

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:37 AM

ఇంట్లో బాబాయ్‌ని చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి.. నీ పార్టీ పునాదులే నేరాలు-ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు..

పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి!

నువ్వు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడతావా?

నేరాలు-ఘోరాలే నీ పార్టీ పునాదులు

జగన్‌పై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘ఇంట్లో బాబాయ్‌ని చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి.. నీ పార్టీ పునాదులే నేరాలు-ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు.. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడూ ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు.. లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావ్‌.. మా ఖర్మ! ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్‌ను వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్‌.. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్‌.. నేరస్థులు ఇష్టం వచ్చినట్లు బతికే లైసెన్స్‌ ఇచ్చావ్‌.. నీ తమ్ముడు అవినాశ్‌రెడ్డి హత్యచేసినా కాపాడావ్‌.. అనంతబాబులాంటి వాడు దళితులను చంపితే ఇంటికి పిలిచి భోజనం పెట్టావ్‌.. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్‌.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చావ్‌.. నువ్వు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావా’ అని మాజీ సీఎం జగన్‌పై విద్యామంత్రి లోకేశ్‌ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారని, 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘కోనసీమ జిల్లాలో 12ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించని నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా’ అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారని, ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారని, మైనారిటీలపైనా దాడులకు పాల్పడ్డారని..

అబ్దుల్‌ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైనది రాష్ట్రంలో మరోటి ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ ఏనాడైనా ఒక్క బాధిత మహిళ వద్దకైనా వెళ్లి కనీసం పరామర్శించారా.. కనీసం ఒక్కసారైనా ఖండించారా అని నిలదీశారు. నరసరావుపేటలో వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారని.. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని పలమనేరులో బాగా చదివే మిస్బా అనే పదో తరగతి విద్యార్థినిని వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని గుర్తుచేశారు. ‘దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేశావ్‌.. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బతుకు’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికీ జగన్‌ పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణమన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా ఆయన పాలన సాగిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో 14,770 ఆటోమేటిక్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే.. జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని మూలనపడేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆయన నాటిన విషబీజాలు పీకిపడేసే పనిలో ఉందన్నారు. సీమలో జగన్‌, ఆయన కుటుంబం పోషించిన ఫ్యాక్షనిజాన్ని అణచివేసిన చరిత్ర చంద్రబాబుదని.. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్టు చేయించా రని. అయితే జగన్‌ కుటుంబం రౌడీలను పెంచి పోషించిందన్నారు. ‘మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు.. తీవ్రవాదంపై పోరాడింది చంద్రబాబు.. ఇప్పుడు ఐదేళ్లుగా నువ్వు పెంచి పోషించిన సైకోలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబే’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Oct 21 , 2024 | 04:37 AM