చిక్కీల ప్యాకెట్ మారింది
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:58 AM
పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది.
వైసీపీ రంగులు... జగన్ ఫొటో మాయం
అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకూ వైసీపీ రంగులతో చిక్కీలను పంపిణీ చేయగా ప్రభుత్వం మారిన దృష్ట్యా ఏ పార్టీకి సంబంధం లేని రంగులతో చిక్కీలను మధ్యాహ్న భోజన విభాగం తయారుచేస్తోంది. ఇవి ఇప్పటికే బడులకు చేరాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో అధికారులు చిక్కీలను సరఫరా చేస్తున్నారు. కాగా ఇప్పటివరకూ వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను కూడా ముద్రించి చిక్కీలు పంపిణీ చేశారు. ఈ చిక్కీలు ఇస్తోంది జగన్ అని చిన్న పిల్లలకు కూడా తెలియాలని గత ప్రభుత్వం ఆరాటపడింది. చివరికి రాగిజావ ఇచ్చే స్టీలు గ్లాసులపైనా జగన్ పేరు వేసింది. ఎన్నికలకు ముందు కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ చిక్కీలతో టీచర్లు నానా పాట్లు పడ్డారు. జగన్ బొమ్మ ఉండటంతో కవర్లు తొలగించి చిక్కీలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వందల సంఖ్యలో కవర్లు తొలగించలేక టీచర్లు ఇబ్బంది పడ్డారు. కవర్లు తొలగించకుండా చిక్కీలు పంపిణీ చేశారనే కారణంతో కొందరు టీచర్లపై చర్యలు కూడా తీసుకున్నారు.