Share News

ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:05 AM

అన్నమయ్య జిల్లా కలకడ శివార్లలో సోమవారం రాత్రి దాదాపు 10గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

 ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, నలుగురికి గాయాలు.. అన్నమయ్య జిల్లాలో ఘటన

కలకడ, అక్టోబరు(ఆంధ్రజ్యోతి) 21: అన్నమయ్య జిల్లా కలకడ శివార్లలో సోమవారం రాత్రి దాదాపు 10గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుంచి కలకడవైపు వస్తున్న ఓ ఆటోను, చిత్తూరు నుంచి హైదరాబాదుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రేవారిపల్లె (సొరకాయలపేట) పంచాయతీ దూదేకులపల్లెకు చెందిన వారు ఆరుగురు ఉండగా చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామానికి చెందిన ఇద్దరు ఉన్నారు. మృతి చెందిన వారిలో దూదేకులపల్లెకు చెందిన బుజ్జమ్మ(55), ఆమె అల్లుళ్లు ఖాదర్‌వలీ(30), నూరుల్లా(35), ఆమె వియ్యంకురాలు ఫకీరాబీ(60) ఉన్నారు. ఈ ప్రమాదంలో బుజ్జమ్మ భర్త ఎ.హసానుల్లా(60), ఆమె కుమార్తె దిల్‌షాద్‌(25), దిల్‌షాద్‌ కుమార్తె సారా(04), వారి బంధువు అమ్మాజీ(26) తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Oct 22 , 2024 | 03:06 AM