చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:04 AM
చంద్రబాబును చూడాలి.... ఆయన కాళ్లు మొక్కాలి అంటూ ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది.
విజయవాడ, జూన్ 11(ఆంధ్రజ్యోతి): చంద్రబాబును చూడాలి.... ఆయన కాళ్లు మొక్కాలి అంటూ ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. వెంటనే కాన్వాయ్ని ఆపించిన చంద్రబాబు ఆ మహిళతో మాట్లాడారు. ఈ సంఘటన మంగళవారం విజయవాడలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ చంద్రబాబును కలవడం కోసం ఏ కన్వెన్షన్ వద్దకు వచ్చి, ఓ పక్కన నిలబడింది. సమావేశం పూర్తయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ ఏ కన్వెన్షన్ ప్రాంగణం నుంచి నెమ్మదిగా రోడ్డు మీదకు వచ్చింది. అక్కడి నుంచి కాస్తంత వేగం పెరిగింది. వాహనంలో ఉన్న చంద్రబాబును చూసిన నందిని ఆయనను కలవడం కోసం కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. దీన్ని గమనించిన చంద్రబాబు వెంటనే వాహనాన్ని నిలుపుదల చేయించారు. ఆయన నందినీని ఆత్మీయంగా పలకరించారు. ‘‘మా కష్టం ఫలించింది. మీరు సీఎం అయ్యారు సార్. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను’’ అని చెప్పింది. వెంటనే చంద్రబాబు వద్దని వారించారు. అప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో దిగారు. జ్వరం ఉన్నా చూడడానికి మదనపల్లె నుంచి వచ్చానని చెప్పింది. ఆసుపత్రిలో చూపించుకోవాలని, అవసరమైన సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.