రీ-సర్వే భూములకు అడంగల్ లాక్
ABN , Publish Date - Jul 04 , 2024 | 12:18 AM
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ-రీసర్వే రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఆన్లైన్లో లభ్యం కాని 1-బీ అడంగల్
రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకర్లు
ఇబ్బందుల్లో రైతులు
ఏమి చేయలేమని చేతులెత్తేసిన అధికారులు
ఆలూరు, జూలై 3: గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ-రీసర్వే రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆన్లైన్లో అడంగల్, సైట్ లాక్ కావడంతో డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకర్లు
ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు పంటలు సాగు చేయడానికి రుణాల కోసం బ్యాంక్లకు వెళ్తే ఖచ్చితంగా 1-బీ అడంగల్ ఇవ్వాలని నిబంధనలు విధిస్తుండటంతో రైతులు ఏమి చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఆలూరు మండలంలోని మూసనహళ్లి, కాత్రికి, కమ్మరచేడు, ముద్దనగేరి, కరిడిగుడ్డెం, మనేకుర్తి గ్రామాల్లో చేపట్టింది. ఆ గ్రామాల రైతులు 1-బీ, అడంగల్లు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ చేతులెత్తేసిన అధికారులు
భూములు రీ-సర్వే జరగడంతో ప్రభుత్వ వెబ్సైట్లోనే 1-బీ అడంగల్ లాక్ పడింది. రైతులు కూడా సమస్యను తమ దృష్టికి తీసుకు వస్తున్నారని ప్రభుత్వమే ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాలని ఆలూరు తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. రుణాలు రీ-షెడ్యూల్కు 1-బీ అడంగల్ అవసరం లేదని, కొత్త రుణాలకు మాత్రమే అవసరం అన్నారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం తప్పనిసరి అంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అవసరం అనుకుంటే మీ-సేవ కేంద్రాల్లో మీ-భూమిలో మ్యానువల్ తీసుకొని వీఆర్తో సంతకం చేసుకుంటే సరిపోతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వం త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.