నేనొచ్చాక కొత్త పాస్బుక్లు
ABN , Publish Date - May 08 , 2024 | 04:01 AM
ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో భాగంగా మీ ఆస్తిని ఈ సీఎం తాకట్టు పెట్టి జిరాక్స్లు ఇస్తాడంట! ఆ పేపర్లు ఎందుకూ పనికిరావు. మీ భూమి మీరు అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా జగన్ జలగ అనుమతి కావాలంట.
జగన్ ల్యాండ్ చట్టంతో సెంటు భూమైనా అమ్ముకోలేం..
జగన్ ఫొటోతో ఉన్న వాటిని చించేయండి: చంద్రబాబు
ఓటమి భయంతో జగన్లో తీవ్ర నిస్పృహ.. డ్రామాలతో ఎవరిని మోసం చేస్తారు?
ఆయన మేనిఫెస్టో ఎత్తిపోయింది.. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు
టీటీడీ సహా అన్ని ఆలయాల ట్రస్టు బోర్డుల్లో బ్రాహ్మణులకు సభ్యత్వం
450 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు.. గుండె రగులుతోంది.. వదిలిపెట్టను
పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తా: టీడీపీ అధినేత.. తిరుపతిలో పవన్తో కలిసి భారీ రోడ్షో
పుంగనూరులోనూ భారీ బహిరంగ సభ.. ఆకురౌడీలను తొక్కిపడేస్తామని హెచ్చరిక
ఆయన ఫొటోతో ఉన్న పాస్పుస్తకాలను చించేయండి చంద్రబాబు
తిరుపతి/పుంగనూరు, మే 7(ఆంధ్రజ్యోతి): ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో భాగంగా మీ ఆస్తిని ఈ సీఎం తాకట్టు పెట్టి జిరాక్స్లు ఇస్తాడంట! ఆ పేపర్లు ఎందుకూ పనికిరావు. మీ భూమి మీరు అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా జగన్ జలగ అనుమతి కావాలంట. సెంటు భూమి కూడా మీరు అమ్ముకోలేరు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
పట్టాదార్ పాస్పుస్తకాల మీద జగన్ ఫొటో వేసుకున్నాడని.. ఆ భూమి ఆయన తాత ఇవ్వలేదు కదా అని ప్రశ్నించారు. ఆ పుస్తకాలను చించేసి చెత్త బుట్టలో పడేయాలని.. తాను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇస్తానని ప్రకటించారు. జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని సభావేదికపైనే చించేశారు. మంగళవారం రాత్రి తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్తో కలిసి భారీ రోడ్షోలో పాల్గొన్నారు.
అంతకుముందు మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డితో కలిసి పుంగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ కొత్త చట్టం తెచ్చి జనం ఆస్తులపై కన్నేశాడని ఆరోపించారు. పొరపాటున వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావని చెప్పారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో కళకళలాడుతుంటే వైసీపీ మేనిఫెస్టో ఎత్తిపోయిందన్నారు. ‘ఖజానాలో ఉండాల్సిన డబ్బు జగన్ వద్ద, మంత్రి పెద్దిరెడ్డి వద్ద ఉంది. జూన్ 4న వసూలు చేయిస్తా’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
ఆ క్షోభ పెద్దిరెడ్డికీ పెడతా..
ఈ ఐదేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతితో రూ.30 వేల కోట్లు సంపాదించారు. నా నియోజకవర్గం కుప్పంలో కూడా గ్రానైట్లను కొట్టేశారు. గతేడాది అంగళ్లు నుంచి పూతలపట్టు వెళ్తుండగా పుంగనూరులో నాపై దాడి చేయించి తిరిగి నాపైనే కేసులు పెట్టించారు. 800 మంది టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టించి, 450 మం దిని జైల్లో పెట్టారు.
పెద్దిరెడ్డికి గుణపాఠం చెబుతాం.. టీడీ పీ కార్యకర్తలు అనుభవించిన క్షోభ ఆయనకూ పెడతా. పెద్దిరెడ్డికి పట్టిన కొవ్వు కరిగిస్తా. ఆయన కుమారుడు, ఎంపీ మిథున్రెడ్డి ఢిల్లీలో సీఏఏ, ఎన్ఆర్సీలని సమర్థించి, ఇక్కడ మాత్రం మా పొత్తును విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ను ఓడించేందుకు మిథున్రెడ్డి పిఠాపురం వెళ్తాడట! ఇక్కడ చూసుకోలేక అక్కడికెళ్లి ఏం చేస్తాడు?
బ్రాహ్మణ కార్పొరేషన్ బలోపేతం..
తిరుపతి, తిరుమలల్లో పవిత్రతను జగన్ ప్రభుత్వం, వైసీపీ నాయకులు దెబ్బతీశారు. దేవాలయాల ఆస్తులను కూడా కబ్జా చేశారు. 50 వేలకు మించి వార్షికాదాయం కలిగిన ఆలయాల అర్చకులకు వేతనాలు అందజేస్తాం. పురోహితులకు, వంటబ్రాహ్మణులకూ సాయమందిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ను బలోపేతం చేస్తాం. బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని పటిష్ఠం చేస్తాం. టీటీడీ సహా అన్ని ఆలయాల ట్రస్టు బోర్డుల్లో బ్రాహ్మణులకు సభ్యత్వమిస్తామని వెంకన్న సాక్షిగా చెబుతున్నా.
బీసీలకు లక్షన్నర కోట్లు..
మేం వచ్చాక రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేసి బీసీలను ఆదుకుంటాం. 50 ఏళ్లకే బీసీలకు, పేదలందరికీ పెన్షన్లు ఇస్తాం. పెన్షన్ను రూ.4 వేలకు పెంచుతాం.