ఉత్తమ విద్యార్థికి విమానయాన కానుక!
ABN , Publish Date - Jun 06 , 2024 | 03:52 AM
పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థికి విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం..
మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కదిరి అర్బన్, జూన్ 5: పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థికి విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం.. విజేతగా నిలిచిన విద్యార్థిని విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్కు పంపించారు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థి ఎద్దుల సుశాంక్రెడ్డికి ఈ అరుదైన కానుకను జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తలమర్ల ప్రభాకర్ ఇచ్చారు. సుశాంక్ రెడ్డి పదో తరగతిలో 589 మార్కులు సాధించి, మండల టాపర్గా నిలిచాడు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం టాప్ స్కోర్ సాధించిన సుశాంక్ రెడ్డిని బుధవారం బెంగళూరుకు తీసుకువెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కించారు. విద్యార్థికి తోడుగా ఓ టీచర్ భార్యను పంపించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు రైలు టికెట్లను కూడా ఉపాధ్యాయుడు బుక్ చేశారు.