అమరావతికి రూ. 11 వేల కోట్ల హడ్కో రుణం
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:59 AM
అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.
ఢిల్లీలో ఆ సంస్థ అధికారులతో మంత్రి నారాయణ చర్చలు సఫలం
సీఆర్డీఏకు రుణం ఇచ్చేందుకు హడ్కో సీఈఓ అంగీకారం
అమరావతి, న్యూఢిల్లీ, గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. అమరావతిని నంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యాలకు అనుగుణంగా అన్నివైపుల నుంచి సహకారం అందుతోంది. అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచబ్యాంకు రూ. 15 వేల కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం వంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మిగిలిన పనుల పూర్తికి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే వాటిలో మొదటి విడత పనుల పూర్తికి రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టిసారించింది. ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఆసియా డెవల్పమెంట్ బ్యాంకు కలిసి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ఇక మిగిలిన రూ. 11 వేల కోట్ల నిధుల మంజూరుకు హడ్కో ఓకే చెప్పింది. సోమవారం ఢిల్లీలో పర్యటించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ హడ్కో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హడ్కో సీఈఓ సంజయ్ కుల్శ్రేష్ట, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎ్సఎన్ మూర్తి పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు సంతృప్తి చెందిన హడ్కో సీఈఓ అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏకు రూ.11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని నారాయణ ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో అమరావతి ఫేజ్-1 నిర్మాణానికి అవసరమైన మొత్తం రూ.26 వేల కోట్లు సర్దుబాటు అయినట్టయింది. ఈ నిధులు విడుదలైతే రాజధాని పనులు వేగంగా ముందుకు సాగనున్నాయి.
పొత్తు వల్లే భారీగా గ్రాంట్లు: పెమ్మసాని
బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలోనే చంద్రబాబు ముందుచూపు, దార్శనికత కనిపిస్తోందని, అందువల్లే అతి తక్కువ సమయంలో, అద్భుత రీతిలో గ్రాంట్లు రాబట్టగలిగామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.