Accident: ఒక నిర్లక్ష్యం.. 3 టైరు పంక్చర్లు!
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:15 AM
వాహనాల టైర్లు పంక్చర్లు కావడం.. డ్రైవర్ల నిర్లక్ష్యం పది నిండు ప్రా ణాలను బలిగొన్నాయి. మరో 34 మందిని ఆస్పత్రి పాల్జేశాయి. కాకినాడ జిల్లాలో పంక్చర్లు వేసుకుంటున్న లారీ డ్రైవర్ల పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకుపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రంలో బొలేరో వాహనం టైరు పేలిపోయి అదుపుతప్పడంతో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులు చనిపోయారు.
10 మంది ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు
34 మందికి గాయాలు..
కాకినాడ జిల్లాలో టైరు పంక్చరు వేస్తుండగా
లారీ డ్రైవర్ల పైనుంచి దూసుకుపోయిన బస్సు
ముగ్గురు డ్రైవర్లతోపాటు స్థానికుడి మృతి
ఉరవకొండలో బొలెరో టైర్ పంక్చర్..
30 మందికి గాయాలు
కర్ణాటకలో వాహనం టైరు పేలి..
ముగ్గురు కర్నూలు జిల్లా రైతుల మృతి
అన్నమయ్య జిల్లా బండపల్లిలో
లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
వాహనాల టైర్లు పంక్చర్లు కావడం.. డ్రైవర్ల నిర్లక్ష్యం పది నిండు ప్రా ణాలను బలిగొన్నాయి. మరో 34 మందిని ఆస్పత్రి పాల్జేశాయి. రాష్ట్రంలో సోమవారం 4 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాకినాడ జిల్లాలో పంక్చర్లు వేసుకుంటున్న లారీ డ్రైవర్ల పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకుపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రంలో బొలేరో వాహనం టైరు పేలిపోయి అదుపుతప్పడంతో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులు చనిపోయారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో బొలె రో వాహనం టైర్ పంక్చరై బోల్తా పడటంతో 30 మంది కూలీలు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా బండపల్లిలో లారీని బైక్ వెనక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
లారీకి పంక్చర్ వేస్తుండగా...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఒడిసా నుంచి బాపట్ల వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో.. స్థానిక పాదాలమ్మ గుడివద్ద రెండు లారీలను రోడ్డు పక్కన ఆపేసి.. డ్రైవర్లు పంచర్లు వేస్తున్నారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో టైర్ పంక్చర్ పనులు చేసుకుంటున్న ముగ్గురు డ్రైవర్ల పైనుంచి దూసుకువెళ్లింది. అదే సమయంలో పాదాలమ్మ గుడి సేవకుడు బహిర్భూమికి వెళ్తుండగా అతడిని కూడా బస్సు ఢీకొట్టింది. సంఘటనా స్థలం వద్దే నలుగురూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా రాజమహేంద్రవరం వెళ్లిపోయాడు. చనిపోయిన ముగ్గురు డ్రైవర్లు బాపట్ల జిల్లా బల్లికురువు మండలం నక్కబొక్కలపాడులోని రామాంజనేయపురానికి చెందిన దాసరి కిశోర్(50), దాసరి ప్రసాద్(40), బండి నాగయ్య(26) కాగా, మరొకరు పాదాలమ్మ గుడి సేవకుడు దిమిలి లోవరాజు(29). సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన పిల్లా శ్రీనివా్సను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టైరు పేలి..
అనంతపురం జిల్లా ఉరవకొండలో ని గుంతకల్లు రోడ్డు లో కూలీలతో వెళ్తు న్న బొలెరో వాహ నం టైర్ పంక్చరై బోల్తా పడింది. అందులోని 30 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వజ్రకరూరుకి చెందిన 45 మంది కూలీలు పాల్తూరులో మిరప పంట కోత పనులకు ఈ వాహనంలో బయలుదేరారు. వాహనం ఉరవకొండ సమీపానికి రాగానే టైర్ పంక్చరై, అదుపు తప్పి, పల్టీకొట్టింది. డ్రైవ ర్ వన్నూరు స్వామితోపాటు 30 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
జ్వరంతో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్తూ..
జ్వరంతో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఆమెతోపాటు ముగ్గురు చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి పంచాయతీలో జరిగింది. రామాపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన డేగల లక్ష్మీభవాని(25) జ్వరంతో ఉన్న తన కుమా ర్తె వినీత(5)ను తీసుకుని.. తన బావ కుమారుడైన కృష్ణబాబు(21) బైక్ పై రాయచోటి బయలుదేరారు. బండపల్లె పంచాయతీలో వీరి ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా కుడివైపు నుంచి ఎడమపక్కకు రావడంతో బైక్ వేగంగా వెళ్లి లారీ వెనుక వైపున ఢీకొంది. బైక్ లారీ లోపలికి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గు రూ అక్కడికక్కడే మృతి చెందారు.
మిర్చి పంట అమ్మేందుకు వెళుతూ..
కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలంలోని నాగలాపురం, సింగరాజనహళ్లి గ్రామాలకు చెందిన పది మంది రైతులు మిరప పంటను విక్రయించేందుకు కర్ణాటక రాష్ట్రంలోని దావణగేరికి బయల్దేరారు. రైతులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం టైరు పంక్చర్ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతులు బోయ యంకన్న(48), మస్తాన్(48), ఆటో ఈరన్న (35)లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు దావణగేరి ప్రభుత్వాసుపత్రికి తరలించిన కేసు దర్యాప్తు చేస్తున్నారు.