Share News

శాంతి అవినీతిపై ఆరా!

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:38 AM

వివాదాస్పదంగా మారిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది.

శాంతి అవినీతిపై ఆరా!

లోతుగా కూపీ లాగుతున్న ప్రభుత్వం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వివాదాస్పదంగా మారిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెర తీశారు. వాటన్నింటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడా కొన్ని తప్పులు చేసినట్టు సమాచారం అందుకున్న కమిషనర్‌... ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారికి లేఖ రాసి నివేదిక పంపాలని సూచించారు. రెండు రోజులుగా అధికారులు అదే పనిలో ఉన్నారు. తన పరిధి కాని ఆలయాల భూముల లీజు వ్యవహారంలో సిఫారసులు చేసి పాతవారికే అవి దక్కేట్టు శాంతి చేశారని గుర్తించారు.

హుండీల సొమ్ము పక్కదారి

ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కించినప్పుడు అందులో కొంత పక్కదారి పట్టించే వ్యవహారాలు ఆమె హయాంలోనే ఎక్కువగా జరిగాయి. నిత్యం ఆమె వెనుక ఉండే సీనియర్‌ అసిస్టెంట్‌ ఇలాంటి పనులు చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆయనకు హుండీ లెక్కింపు విధులు వేయవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ శాంతి దానిని ఉల్లంఘించి ఆయనకు మళ్లీ హుండీ లెక్కింపు డ్యూటీలు వేయడంతో శాంతికి కూడా ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు.

మూడు రోజులు జిల్లా సిబ్బంది ధర్నా

దేవదాయ శాఖలో పనిచేసే వారు ఎవరైనా తాను వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయకపోతే శాంతి వారిని ఆఫీసుకు పిలిపించుకొని వేధించేవారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమెను బదిలీ చేయాలంటూ జిల్లా సిబ్బంది మొత్తం ఆమె కార్యాలయం ముందే వరుసగా మూడు రోజులు ధర్నా నిర్వహించారు. డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లిన ఘటనలోనూ రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆమెపై ఏ చర్యలు తీసుకోలేకపోయారు. విశాఖపట్నంలో వైసీపీ ప్రధాన నాయకుడి అండ ఉందని బాగా ప్రచారం జరగడంతో దానిని ఆమె క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఎవరికి, ఏ శాఖలో పని ఉన్నా చేసి పెడతానంటూ రాయబేరాలు సాగించి, ఆ పనులు చేసి పెట్టేవారు. దీంతో ప్రొబేషన్‌ పీరియడ్‌ కూడా పూర్తికాకముందే విశాలాక్షినగర్‌లో రూ.80 లక్షల విలువైన ఫ్లాట్‌ కొనుగోలు చేయగలిగారు.

ఒంటి నిండా బంగారం

శాంతి కుటుంబం పూరిగుడిసెలో ఉండేదని, పేదవారని, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానని ఆమె భర్త మదన్‌గోపాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెళ్లి సమయంలో తనకు పుట్టింటివారు వంద కాసుల బంగారు ఆభరణాలు పెట్టారని శాంతి ప్రచారం చేసుకునేవారు. పుట్టింటివారు అంత ధనవంతులైతే తల్లి కొబ్బరికాయల దుకాణం, తండ్రికి వాచ్‌మెన్‌ ఉద్యోగం ఎందుకోనని సిబ్బంది గుసగుసలాడుకునేవారు. విశాఖ నుంచి 2022 జూలై 1న బదిలీపై ఎన్‌టీఆర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే విల్లా కొనుగోలు చేశారు. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే ఫ్లాటు, బంగారం, కారు, కోట్ల రూపాయల విలువైన విల్లా కొనేంత ఆదాయం ఎలా వచ్చిందనే దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది.

దృష్టంతా వసూళ్లపైనే

శాంతి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అదనపు ఆదాయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. డిపార్టుమెంట్‌లో అన్ని విషయాలు తెలిసిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ని ఎక్కడికెళ్లినా తోడుగా తీసుకువెళ్లేవారు. ఏ ఆలయానికి తనిఖీకి వెళ్లినా తనకో పట్టుచీర, రూ.10వేల నగదు ఇవ్వాలనే నిబంధన విధించారు. ఎన్‌టీఆర్‌ జిల్లాకు వెళ్లిన తరువాత అక్కడా ఈ సంప్రదాయం కొనసాగించినట్లు సమాచారం. అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో ఏడాదికి రూ.5లక్షల ఆదాయం కలిగిన 6-సీ కేటగిరీ ఆలయాల భూములను మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం ఉంటుంది. అయితే శాంతి డీసీ, ఆర్‌జేసీల పర్యవేక్షణలో ఉన్న ఆలయ వ్యవహారాల్లోనూ తలదూర్చి, ఆయా భూముల లీజుకు సిఫారసు చేసి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Jul 21 , 2024 | 03:38 AM