ఆవాస్ ప్లస్ యాప్.. గేమ్ ఛేంజర్
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:17 AM
ఆవాస్ ప్లస్ 2024 యాప్ గేమ్ ఛేంజర్గా మారబోతున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
మోదీ, చంద్రబాబు విజనరీ లీడర్లు: పెమ్మసాని
గుంటూరులో 5 రాష్ట్రాల శిక్షణ సదస్సు
గుంటూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆవాస్ ప్లస్ 2024 యాప్ గేమ్ ఛేంజర్గా మారబోతున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) ను వినియోగించుకొంటూ ముఖ గుర్తింపుతో గృహ నిర్మాణ పథకం దుర్వినియోగం కాకుండా ఈ యాప్ ద్వారా కట్టడి చేయవచ్చన్నారు. సోమవారం గుంటూరులో పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్, ఆవాస్ ప్లస్ 2024 యాప్ వినియోగంపై ఐదు రాష్ట్రాల గృహనిర్మాణ శాఖ అధికారులకు నిర్వహించిన శిక్షణ శిబిరం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. అందరికీ ఇళ్లు అనేది కేవలం నినాదంగానే ఉండిపోకుండా నిజం చేసే విజనరీ లీడర్లుగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులను అభివర్ణించారు. అసోంలో షేరింగ్ విధానంలో రూ.2 లక్షల యూనిట్ కాస్ట్తో గృహ నిర్మాణాలు చక్కగా జరిగాయని వివరించారు. 29 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రధాన మంత్రి జన్మన్ స్కీం కింద మారుమూల ప్రాంతాల్లో 3.27 లక్షల గృహాలను మంజూరు చేయగా, వాటిల్లో 42 వేల గృహాలు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడు తూ రానున్న ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. కేంద్రం పీఎంఏవై గ్రామీణ్ అర్హతకు విధించిన 10 పాయింట్లలో మూడింటిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 3, 4 చక్రాల మోటారు వాహనాలను వివిధ అవసరాల నిమిత్తం పేద కుటుంబాలు సైతం వినియోగిస్తున్నాయని, బ్యాంకర్ల నుంచి రుణాలు తీసుకొని కొనుగోలు చేస్తున్నాయని, వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ, ఇతర కార్మికులు, చేతివృత్తులవారి ఆదా య పరిమితిని కనీసం రూ.25 వేలకు పెంచాలని సూచించారు. గృహాలను నిర్మించడానికి యూనిట్ ధర ఏమాత్రం సరిపోదని, బేస్మెంట్కే దాదాపు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోందన్నారు. కేంద్రం గృహనిర్మాణాల యూనిట్ ధరను పెంచాలని కోరారు. రాష్ట్ర గృహానిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షలు గృహాలు పూర్తయ్యాయన్నారు.