Share News

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:32 AM

రాజధాని అమరావతిలోని భవన నిర్మాణాల పటిష్ఠతకు ఎలాంటి ఢోకా లేదని, స్టీల్‌, కాంక్రీట్‌ దృఢంగా ఉన్నాయని చెన్నై,

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

కాంక్రీట్‌, ఐరన్‌ దృఢత్వం ఓకే

హైకోర్టు, ఐఏఎస్‌, ఎన్‌జీవోల భవనాలూ బాగున్నాయి

సీఆర్‌డీఏకు హైదరాబాద్‌, చెన్నై ఐఐటీ నిపుణుల నివేదిక

ఊపిరి పీల్చుకున్న సీఆర్‌డీఏ.. వైసీపీ హయాంలో

చిట్టడవిని తలపించిన అమరావతి ప్రాంతం

విజయవాడ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని భవన నిర్మాణాల పటిష్ఠతకు ఎలాంటి ఢోకా లేదని, స్టీల్‌, కాంక్రీట్‌ దృఢంగా ఉన్నాయని చెన్నై, హైదరాబాద్‌ ఐఐటీల నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఆర్‌డీఏకు సోమవారం నివేదికను అందించారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టింది. దీంతో అప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా పట్టించుకోలేదు. ఫలితంగా గత ఐదేళ్ల కాలంలో అమరావతి చిట్టడవిని తలపించే పరిస్థితికి చేరుకుంది. తాజాగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత మళ్లీ అమరావతిపై దృష్టి పెట్టింది. అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఇక్కడి నిర్మాణాల దృఢత్వంపై ఐఐటీ నిపుణులతో ప్రభుత్వం పరిశీలన చేయించింది. ఈ క్రమంలో గత నెలలో చెన్నై, హైదరాబాద్‌ ఐఐటీల నిపుణులు పలుమార్లు అమరావతిలో పర్యటించి నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. తాజాగా తమ నివేదికను సీఆర్‌డీఏ అధికారులకు అందించారు. భవనాలన్నీ బాగానే ఉన్నాయని, తదుపరి నిర్మాణ పనులు చేపట్టవచ్చని, వాటిని కూల్చివేయాల్సిన అవసరం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐఐటీ సంస్థలు కనుక అమరావతి నిర్మాణాల పటుత్వంపై అనుమానం వ్యక్తం చేసి ఉంటే వాటిని కూల్చివేసి మళ్లీ మొదటి నుంచి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చేది.

నివేదికల్లోని కీలక అంశాలు

ఐదు ఐకానిక్‌ టవర్లను రాఫ్ట్‌ ఫౌండేషన్‌ టెక్నాలజీతో చేపట్టారు. ఐఐటీ సంస్థలు రెండూ ఈ నిర్మాణాలు బాగున్నాయని తేల్చిచెప్పాయి. కాంక్రీట్‌లో కానీ, ఐరన్‌లో కానీ ఎక్కడా లోపాలు లేవని పేర్కొన్నాయి. వాస్తవానికి సచివాలయ ఐకానిక్‌ టవర్లు గత ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. దీంతో వీటి పటిష్ఠతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. ఐఐటీ సంస్థలు ఈ టవర్ల కాంక్రీట్‌, స్టీల్‌ బాగుందని పేర్కొన్నాయి. హైకోర్టు భవనానికి సంబంధించి కూడా ఐఐటీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.

నిశిత పరిశీలన

అమరావతిలో భవన నిర్మాణ పనులకు సంబంధించి ముందుకు వెళ్లే విషయంలో ప్రభుత్వం టెక్నికల్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల ప్రకారం ఐఐటీ సంస్థల ద్వారా అమరావతి నిర్మాణాలను పరిశీలన చేయాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్‌, చెన్నై ఐఐటీ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలు రెండూ గత నెలలో అమరావతికి వచ్చి సిమెంట్‌ కాంక్రీట్‌, ఐరన్‌ ముక్కలను కట్‌ చేసుకుని శాంపిళ్లను తీసుకువెళ్లి అన్ని కోణాల్లోనూ పరీక్షించాయి. పరీక్షలలో కాంక్రీట్‌, స్టీల్‌ బాగున్నాయని, సచివాలయ టవర్లకు సంబంధించి రాఫ్ట్‌ ఫౌండేషన్‌ దుర్బేధ్యంగా ఉందని తాజాగా నివేదిక ఇచ్చాయి.

Updated Date - Sep 17 , 2024 | 04:41 AM