క్రైస్తవులు, దళితులు వైసీపీకి ఓటేయొద్దు
ABN , Publish Date - Jan 08 , 2024 | 06:03 AM
దేశంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ ‘ఇండియా’ తరహా కూటమి ఏర్పాటు చేస్తున్నామని
కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పిలుపు
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7: దేశంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ ‘ఇండియా’ తరహా కూటమి ఏర్పాటు చేస్తున్నామని, బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కలుపుకొని కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేడీ శీలం అన్నారు. దళితులను వంచించి దగాచేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో దళితులు, క్రైస్తవులు ఓటు వెయ్యరాదని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘సామాజిక సమాలోచన’ అంశంపై సమావేశం జరిగింది. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుకోసం 9 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం జిల్లాల్లో పర్యటిస్తూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కుల, సామాజిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం కాకినాడ, మంగళవారం విశాఖలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సంక్రాంతి తర్వాత రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. వైఎస్ షర్మిల రాకతో పార్టీలో ఉత్సాహం పెరిగిందన్నారు. పార్టీ పునర్నిర్మాణం జరగాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని శీలం అన్నారు.