CID: వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Jun 29 , 2024 | 03:38 AM
అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.
![CID: వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు](https://media.andhrajyothy.com/media/2024/20240625/Untitled_1_copy_6af1249aad_v_jpg.webp)
మద్యం అక్రమాలు తవ్వుతున్న సీఐడీ
కుంభకోణంపై కీలక ఆధారాల సేకరణ
‘బేవరేజెస్’ కంప్యూటర్లపై ప్రత్యేక దృష్టి
నిపుణుల ద్వారా డిలీట్ వివరాల రికవరీ
అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాడేపల్లి ప్యాలె్సకు ఎంత డబ్బు తరలించారో సీఐడీ తవ్వి తీస్తోంది. ప్రభుత్వం మారగానే తెలంగాణకు పారిపోయిన ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు మొత్తం కుంభకోణాన్ని వెలికి తీస్తున్నారు. విజయవాడలోని ఏపీ బేవరేజెస్ కార్యాలయాన్ని ఇప్పటికే అధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్ చేయించారు. అందులోని సమాచారంతోపాటు డిలీట్ చేసిన వివరాలనూ నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకూ సోదాల్లో లభించిన ఆధారాలపై కసరత్తు చేసిన సీఐడీ అధికారులు శుక్రవారం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణం ఎలా జరిగింది..? ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలె్సకు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నా యి..? ఎక్కువ ఆర్డర్ పొందిన మద్యం కంపెనీ ఏది.. అనధికారికంగా ఎవరెవరు ఎంతిచ్చారనే అంశాలపై కూపీ లాగుతున్నారు. అసలు సూత్రధారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు.