ఎన్డీఎ్సఏ నివేదిక అమలుకు కమిటీ
ABN , Publish Date - May 22 , 2024 | 05:00 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు వీలుగా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికను అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురు అఽధికారులతో కమిటీని నియమించింది.
ఈఎన్సీ చైర్మన్గా నలుగురు సభ్యులు
మరమ్మతులను పర్యవేక్షించనున్న కమిటీ
కేంద్ర సంస్థలతో బ్యారేజీల అధ్యయనం
నేడు రాష్ట్రానికి సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు వీలుగా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికను అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురు అఽధికారులతో కమిటీని నియమించింది. బ్యారేజీలపై అధ్యయనాలతోపాటు వాటి మరమ్మతు పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ఈఎన్సీ(ఓఅండ్ఎం), సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్ ఉంటారు. మెంబర్ కన్వీనర్గా రామగుండం ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ వ్వవహరిస్తారు. అయితే ఇందులో నిపుణులను కూడా సభ్యులుగా నియమించుకునే అవకాశాన్ని కమిటీ చైర్మన్కు ఇస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. వానాకాలం వచ్చేలోపు బ్యారేజీలపై అధ్యయనం/పరీక్షలు పూర్తిచేసి, బ్యారేజీల రక్షణ కోసం తగిన మరమ్మతులు చేయాలని ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, బ్యారేజీల రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక పనులను ఈ కమిటీ సమన్వయం చేసుకోనుంది. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయో నిగ్గు తేల్చడానికిగాను వాటిపై భూ భౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలన్న ఎన్డీఎ్సఏ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఆశ్రయించింది.
ఢిల్లీలోని కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్సఎంఆర్ఎస్), పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్తు పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్), హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఏ)తో బ్యారేజీలపై అధ్యయనం చేయించాలని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. దీంతో పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎ్సకు చె ందిన ముగ్గురు నిపుణులు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. తొలుత వారు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. ఆ తరువాత బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేపడతారు. మరోవైపు సీఎ్సఎంఆర్ఎ్సకు చెందిన నిపుణులు కూడా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. మరోవైపు బ్యారేజీల వద్ద మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. సీసీ బ్లాకులు, అప్రాన్లను సరిచేసే పనులు జరుగుతున్నాయి. వరదకు అడ్డంగా ఉన్న ఇసుకను కూడా తరలిస్తున్నారు.