ఉద్యోగం చేసే వారికీ డిప్లొమా
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:31 AM
ఇకపై ఉద్యోగం చేస్తున్న వారు కూడా డిప్లొమా చదవొచ్చు. పగలు ఉద్యోగం చేసుకుంటూ.. రాత్రి వేళలు, ఆదివారాల్లో డిప్లొమా తరగతులకు హాజరు కావొచ్చు.
రాత్రి వేళలు, ఆదివారాల్లో తరగతులు
రెండేళ్ల కాలంలోనే కోర్సు పూర్తి
రాష్ట్రంలో అమల్లోకి నూతన విధానం
ఆరు కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఇకపై ఉద్యోగం చేస్తున్న వారు కూడా డిప్లొమా చదవొచ్చు. పగలు ఉద్యోగం చేసుకుంటూ.. రాత్రి వేళలు, ఆదివారాల్లో డిప్లొమా తరగతులకు హాజరు కావొచ్చు. రెగ్యులర్ విద్యార్థులు మూడేళ్లలో డిప్లొమా పూర్తి చేస్తే, ఇలా ఉద్యోగాలు చేసుకునే వాళ్లు రెండేళ్లలోనే కోర్సును పూర్తిచేసే అవకాశాన్ని సాంకేతిక విద్యాశాఖ కల్పించింది. రాష్ట్రంలో తొలిసారి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐసీటీఈ అనుమతితో రాష్ట్రంలో ఆరు కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేసింది. వాటిలో ఒక ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అభ్యర్థులు ఈనెల 26లోగా దరఖాస్తులు సమర్పించాలని సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి వి.విజయ్కుమార్ తెలిపారు. సంబంధిత పాలిటెక్నిక్లో 28న కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. ఇంటర్మీడియట్ లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసిన వారు ఈ కోర్సులకు అర్హులు. విశాఖపట్నంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 169 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన ఐదు ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో బ్రాంచ్కు 33 సీట్లు చొప్పున ఉన్నాయి.