రాజధాని పనులపై డ్రోన్!
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:05 AM
రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని డ్రోన్ ఫొటో కమ్ వీడియో చిత్రీకరణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది.
వీడియో కమ్ ఫొటోల చిత్రీకరణకు నిర్ణయం
టెక్నికల్ కమిటీ తొలి క్షేత్ర స్థాయి పర్యటన
రాజఽధానిలో రోడ్లు, భవనాలు, మెటీరియల్ పరిశీలన
త్వరలో కాంట్రాక్టర్లతో సమావేశం
విజయవాడ, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని డ్రోన్ ఫొటో కమ్ వీడియో చిత్రీకరణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. గత ఫుటేజీ, ప్రస్తుత ఫుటేజీ ఆధారంగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఈ కమిటీ శుక్రవారం పరిశీలిచింది. ప్రాథమిక అవగాహన కోసం .. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆనందరావు నేతృత్వంలోని ఇంజనీరింగ్ టెక్నికల్ కమిటీ రాజధాని ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. కమిటీ ఏర్పడిన తొలి క్షేత్ర స్థాయి పర్యటన ఇది. ప్రాథమిక అవగాహన కోసం శుక్రవారం రాజధానిలో ఈ కమిటీ పరిశీలించింది. రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎన్ 9, ఎన్ 4 రహదారులను పరిశీలించారు. మిగిలిన రహదారులు, అంతర్గత రహదారులను పరిశీలించటానికి ముళ్ల కంపలు ఉండటంతో సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలు, గవర్నమెంట్ టైప్ 1, టైప్ 2 భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. శాశ్వత సచివాలయ నిర్మాణ భవనాలను సాంకేతిక బృందం ఆసాంతం పరిశీలించింది. మొత్తం ఐదు టవర్ల ప్రాంతాలకు వెళ్లి పరిశీలించింది. నీళ్లలో నాని ఉన్న టవర్ల భవనాలను పరిశీలించింది. కాంక్రీట్ పరంగా బాగానే ఉందని గుర్తించింది. కాంక్రీట్ లోపల ఉన్న స్టీల్, బయటకు వచ్చిన స్టీల్ తుప్పు పట్టిందా? దాని పరిస్థితి ఏవిధంగా ఉందన్నది ప్రాథమికంగా పరిశీలించారు. స్టీల్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిపుణులను పిలిపించి పరిశీలించేందుకు నిర్ణయించారు. ఇంతకుముందు కూడా చెన్నై ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీ వంటి సంస్థలతో అధ్యయనం చేయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెక్నికల్ కమిటీ ఏ సంస్థలతో పరిశీలించాలని సూచిస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పైపులైన్ల పనులను కూడా పరిశీలించారు. పైపులైన్లపై పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ బృందంతో నివేదిక తయారు చేయించాలని చైర్మన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మలి విడతగా కాంట్రాక్టు సంస్థలతో భేటీ అవ్వాలని టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. కాంట్రాక్టు సంస్థలు ఎంత వరకు పనులు చేపట్టారు ? సమస్యలు ఏమిటన్నది వారి తో ప్రజంటేషన్స్ రూపంలో తెలుసుకుంటారు. అనంతరం ఏం చేయాలన్నదానిపై కమిటీ ముందుకు వెళుతుంది. మరో వారం రోజుల్లో టెక్నికల్ కమిటీ పూర్తి ప్రక్రియను చేపట్టి, ప్రభుత్వం నిర్దేశించిన నెల రోజుల లోపే నివేదికను ఇవ్వాలని భావిస్తోంది.