నేటి నుంచి నీటి సంఘాల ఎన్నికలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:17 AM
రాష్ట్రంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు మంగళవారం నుంచి ఎన్నికలు జరగనున్నాయి.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు మంగళవారం నుంచి ఎన్నికలు జరగనున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరపాలన్న ఆలోచనే రాలేదు. నిధులూ ఇవ్వలేదు. రాష్ట్రంలో 21,060 మేజర్, 3192 మీడియం, 24,768 మైనర్ మొత్తంగా 49,020 ప్రాదేశిక సంఘాలు, 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా సాగునీటి వనరులను పరిరక్షించుకునే విధానం ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలులోకి వచ్చింది. దీనిని 2019 దాకా కొనసాగించారు. అయితే, 2019-24 మధ్య ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ తరహాలోనే సాగునీటి సంఘాలనూ నాటి సీఎం జగన్ నిర్వీర్యం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.