Share News

Andhra Pradesh :దేవుడికి రక్షణేదీ !

ABN , Publish Date - May 11 , 2024 | 04:41 AM

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యరథాన్ని తగులబెట్టారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెండి రథంలోని వెండి సింహాల ప్రతిమలు అపహరించారు.

Andhra Pradesh :దేవుడికి రక్షణేదీ !

ఆలయాలపై వైసీపీ పడగ

అంతర్వేది, కొండబిట్రగుంటలో రథాలు దగ్ధం

రామతీర్థంలో కోదండరాముడి తల నరికివేత

పిఠాపురంలో దేవతల విగ్రహాలు ధ్వంసం

దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనన్ని దారుణాలు

కేసులు దర్యాప్తు చేయరు.. నిందితుల్ని పట్టుకోరు

జగన్‌ పాలనలో హిందువులపై ముప్పేట దాడి

మహాభారతంలో అర్జునుడితో పోల్చుకుంటారు. తాను చేసేది ధర్మయుద్ధమని చెప్పుకుంటారు. నుదుట నామాలు పెట్టుకుంటారు. పుష్కర స్నానాలు చేస్తారు. సీఎం హోదాలో సంప్రదాయ వస్త్రధారణలో దేవుడికి పట్టవస్త్రాలూ సమర్పిస్తారు.

ఉగాది, సంక్రాంతి వంటి పండుగలకు తాడేపల్లి ప్యాలె్‌సలోనే ఆలయాల సెట్టింగ్‌ వేయించి ఫొటోలకు పోజులిస్తారు. కానీ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరిగినా, హిందూ దేవతల విగ్రహలను ధ్వంసం చేసినా కిక్కురుమనరు. ఇక ఈ ఘటనలపై కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవడం అనే మాటలకు తావే లేదు. హిందువులకు, హిందూ దేవుళ్లకు సీఎం జగన్‌ ఇచ్చే గౌరవం ఇదీ!

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యరథాన్ని తగులబెట్టారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెండి రథంలోని వెండి సింహాల ప్రతిమలు అపహరించారు. పిఠాపురంలో వినాయకుడు, షిర్డీ సాయిబాబా విగ్రహాలతో పాటు మరెన్నో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆలయాలను తవ్వేశారు. హుండీలు కొల్లగొట్టారు.

ఇలా ఒకటీ, రెండూ కాదు... జగన్‌ ఏలుబడిలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా హిందువులపై ముప్పేట దాడి జరిగింది. భక్తులు పరమ పవిత్రంగా భావించే 36 దేవాలయాలపై కనీవినీ ఎరుగని స్థాయిలో దాడులు చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాలే టార్గెట్‌గా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల్లో అరాచకాలు సృష్టించారు. ప్రధాన పూజారులను అవమానించారు. అర్చకులను హింసించారు.

అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఒక్క ఘటనపైనా సీఎం జగన్‌ స్పందించిన దాఖలాలు లేవు. చాలా ఘటనల్లో మతిస్థిమితం లేని వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నవారే కారకులని తేల్చేసి మమ అనిపించారు.

మరికొన్ని ఘటనల్లో అసలు కేసులే నమోదు చేయలేదు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 2020 జనవరిలో కొంతమంది దుండగులు ఎనిమిది ఆలయాల్లో ఉన్న 14 దేవతా విగ్రహాలను రాత్రి వేళ ధ్వంసం చేశారు. నాటినుంచే రాష్ట్రంలో దేవతా విగ్రహాలపై దాడులు తీవ్రమయ్యాయి. ఆ రోజే వైసీపీ ప్రభుత్వం కారకులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని ఆలయాలపై దాడి ఘటనలు జరిగి ఉండేవి కావు.


  • రామతీర్థంలో దారుణం

రామతీర్థం ఆలయంలో తల నరికిన శ్రీరాముడి విగ్రహం, కోనేటిలో లభ్యమైన రాముడి తలను తీసుకొస్తున్న దృశ్యం

పిఠాపురం ఘటన తర్వాత విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల తెగ్గోసి, సమీపంలో ఉన్న కోనేట్లో పడేశారు. ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల మనసులను కలచి వేసింది. ఈ ఘోరంపై జగన్‌ ప్రభుత్వం స్పందించిన తీరు మరింత దారుణంగా ఉంది. విగ్రహాలపై దాడులు సహజమే అన్నట్లు, కొత్త విగ్రహం తెచ్చి పెట్టేస్తామంటూ మంత్రులు తేలికచేసి మాట్లాడారు. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించినా ఇప్పటికీ దర్యాప్తు ముందుకు కదల్లేదు. ధర్మానికి ప్రతీకైన శ్రీరాముడి తల తీసేస్తేనే పట్టించుకోని జగన్‌... తాను ధర్మయుద్ధం చేస్తున్నానంటే నమ్మడం ఎలా?

  • అంతర్వేది రథానికి నిప్పు

దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన దివ్యరథాన్ని 2020 సెప్టెంబరు 6వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. 40 అడుగుల ఎత్తయిన రథం కాలి బూడిదైంది. ఈ దారుణానికి కారకులెవరో ప్రభుత్వం ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది. అలాగే 2020 ఫిబ్రవరిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ రథం తగులబడింది. దేవదాయ శాఖ అధికారులు కేసు పెట్టడంతో సరిపుచ్చారు. చివరకు మతిస్థిమితం లేని వ్యక్తి పనిగా తేల్చేసి, విచారణను అక్కడితో ముగించారు. తర్వాత సీజేఎఫ్‌ నిధుల నుంచి రూ.87లక్షలు కేటాయించి కొత్త రథాన్ని తయారుచేయించారు.

  • వెండి సింహాలు చోరీ

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలోని వెండి రథంపై ఉన్న నాలుగు వెండి సింహాల్లో మూడు సింహాలను దొంగలు ఎత్తుకుపోయారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. కొన్నిరోజుల తర్వాత పోలీసులు దొంగలను పట్టుకుని, వారి నుంచి వెండి మొత్తాన్ని రికవరీ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో రత్నగిరి అమ్మవారి ఆలయంలో నంది విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. రాయదుర్గం సమీపంలో ఉన్న పశుపతినాథ స్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని, ఆకివీడులో సరస్వతీ దేవి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - May 11 , 2024 | 04:41 AM