నేడూ భగభగలే!
ABN , Publish Date - May 31 , 2024 | 03:16 AM
రోహిణీ కార్తె ప్రభావంతో గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు ఉధృతంగా వీస్తున్నాయి.
47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): రోహిణీ కార్తె ప్రభావంతో గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు ఉధృతంగా వీస్తున్నాయి. శుక్రవారం వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 145 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
పామూరులో 44.8 డిగ్రీలు నమోదు
గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6, కృష్ణా జిల్లా కోడూరులో 44.5, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లో వెచ్చని గాలులు వీచాయి.