కాటసాని ఇలాకాలో వైసీపీ సభకు జనం కరువు
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:42 AM
సామాజిక సాధికార సభ పేరుతో వైసీపీ జనసమీకరణ చేస్తున్నా ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది.
సామాజిక సాధికార బస్సుయాత్ర తుస్సు
నేతలు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనం
కర్నూలు(అర్బన్), జనవరి 4: సామాజిక సాధికార సభ పేరుతో వైసీపీ జనసమీకరణ చేస్తున్నా ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది. గురువారం కర్నూలు జిల్లా కేంద్రంలోని చెన్నమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన సాధికార బస్సుయాత్ర సభ మరోసారి తుస్సుమంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పుతున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బస్సుయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఊహించినదానికంటే జనం తక్కువగా రావడం, వచ్చిన వాళ్లు కూడా వైసీపీ నేతల ప్రసంగిస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ కావడంతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్కు చెందిన ప్రధాన అనుచరుడు గుర్తించి వలంటీర్లను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నం చేశారు. గడివేములు, పాణ్యం మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు కీలక నాయకులు ఆపసోపాలు పడ్డారు. సభా ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదికపైకి చేరుకోగానే ప్రజలకు అభివాదం చేసేందుకు పోటీపడినా.. స్పందన కరువైంది. కీలక నాయకులు మాట్లాడుతుండగానే ఖాళీ అయిన కుర్చీలను వైసీపీ కార్యకర్తలే తొలగించడం కొసమెరుపు.