Share News

బాబు అరెస్టుకు ఏడాది

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:34 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యి సోమవారం నాటికి సరిగ్గా ఏడాది!

బాబు అరెస్టుకు ఏడాది

వైసీపీ పతనాన్ని వేగవంతం చేసిన చర్య

ఐదేళ్లూ టీడీపీ, బాబుపై రాజకీయ కక్ష సాధింపులే

‘స్కిల్‌’ అక్రమ కేసుపెట్టి అన్యాయంగా జైలుకు

ఇప్పుడు సీఎంగా జనంలో చంద్రబాబు

విపక్ష నేత హోదా సైతం గల్లంతై

కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యి సోమవారం నాటికి సరిగ్గా ఏడాది! స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో మోపిన అక్రమ కేసులో గత ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పదకొండో తేదీన ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఏభై మూడు రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమాలు జరిగాయన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించింది. జైల్లో ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా ఆయన పార్టీకి చెందిన నేతలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకుతోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం ఇదే ప్రఽథమం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఆయనను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే పతన దిశలో ఉన్న వైసీపీ మరింత వేగంగా పతనమై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ అధినేత జగన్‌కు అసెంబ్లీలో విపక్ష నేతహోదా కూడా లభించలేదు. ఈ పరిణామాలన్నింటి వెనుక చంద్రబాబు అరెస్టు కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


టీడీపీ దూకుడుకు దడిచి..

లోకేశ్‌ పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర వంటి కార్యక్రమాలతో నాడు టీడీపీ దూసుకుపోయింది. ఈ దూకుడును తగ్గించడానికి చంద్రబాబు అరెస్టు ఉపకరిస్తుందని వైసీపీ నాయకత్వం ఆలోచన చేసింది. కానీ తుది ఫలితం వేరుగా వచ్చింది. ఈ అరెస్టు జన సామాన్యంలో చంద్రబాబు పట్ల సానుభూతి పెల్లుబుకడానికి దారితీసింది. ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా, స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు వేల సంఖ్యలో ఎదురుచూశారు. విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు, యువత ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన అరెస్టుకు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడానికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలకడానికి దారితీసింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్థిరపడ్డ అన్ని దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. ఒక్క అమెరికాలోనే ఎనభై నగరాల్లో ప్రదర్శనలు జరిగాయని అంచనా. ఏభైకు పైగా దేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని టీడీపీ ప్రవాసాంధ్ర విభాగం నమోదు చేసింది.


జైలులోనే పొడిచిన పొత్తు...

చంద్రబాబు అరెస్టు అనేక రాజకీయ పరిణామాలకు దారితీసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి... తాము, టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. బీజేపీ తటస్థంగా ఉంటుందని ఆశించిన వైసీపీకి ఆశాభంగం మిగిలింది. అరెస్టు జరిగిన ఏడాది తర్వాత చూస్తే... చంద్రబాబు జనంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. విజయవాడను వరద ముంచెత్తడంతో చంద్రబాబు తాత్కాలికంగా తన కార్యక్షేత్రాన్ని విజయవాడకు మార్చుకొని పనిచేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. విదేశాలకు వెళ్లాలని అనుకొన్న జగన్‌కు కోర్టు నుంచి అనుమతులు రాకపోవడంతో, ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు ఉంటుంది. దిగిపోయిన తర్వాత దానిని వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. సాధారణ పాస్‌పోర్టు కొత్తగా ఆయనకు ఐదేళ్ల కాల వ్యవధికి ఇవ్వాలని కింది సీబీఐ కోర్టు ఆదేశించింది. దానిని ఏడాదికి మాత్రమే మంజూరు చేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్‌ హైకోర్టుకు వెళ్లారు. ఈ నెల మూడో తేదీనే లండన్‌ వెళ్లాలని అనుకొన్న ఆయన.. కోర్టు వ్యవహారం తేలకపోవడంతో ఎదురుచూపుల్లో ఉన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 07:51 AM