Share News

ఇంకా జగన్‌ జపమేనా

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:23 AM

జగన్‌ పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించినా ప్రభుత్వ శాఖలు మాత్రం ఆయన జపమే చేస్తున్నాయి. ఇంకా జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్లుగా కీలక ప్రభుత్వ రికార్డుల్లో ఆయన ఫొటోలనే అచ్చేస్తున్నాయి.

ఇంకా జగన్‌ జపమేనా

ఆయన ఫొటోలతోనే రెవెన్యూ రికార్డుల జారీ

ప్రభుత్వం మారి 3 నెలలైనా మారని తీరు

రైతులకు ఇచ్చే అడంగల్‌ కాపీపై

ఇంకా జగన్‌ ఫొటో, నవరత్నాల లోగో

సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు

సర్టిఫికెట్లపై ఆయన బొమ్మలే దర్శనం

తొలగించాలని చంద్రబాబు ఆదేశించినా

తీరు మార్చుకోని అధికారులు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించినా ప్రభుత్వ శాఖలు మాత్రం ఆయన జపమే చేస్తున్నాయి. ఇంకా జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్లుగా కీలక ప్రభుత్వ రికార్డుల్లో ఆయన ఫొటోలనే అచ్చేస్తున్నాయి. వాటిని ప్రజలకు అందిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా జగన్‌ ఫొటోలే వేస్తున్నారేమిటని ప్రజలు విస్తుపోతున్నారు. అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వ రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లపై జగన్‌ ఫొటోలు వద్దని, అలా ఉన్నవాటిని ప్రజలకు అందించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పదేపదే హితబోధ చేసినా వాళ్లు మారడం లేదు. జగన్‌ జపమే చేస్తామంటూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వత్సవాయి మండలం దుబ్బాకపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సర్టిఫైడ్‌ అడంగల్‌ కాపీ ఇవ్వాలని గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మండల తహసీల్దార్‌ ఇచ్చిన సర్టిఫైడ్‌ కాపీని గ్రామ సచివాలయం నుంచి ఆ రైతుకు 12వ తేదీన జారీ చేశారు. దాన్ని పరిశీలిస్తే ఎగువ కుడిభాగంలో జగన్‌ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో, నవరత్నాల లోగో ఉంది. దానిపై తహసీల్దార్‌ పేరు, సంతకం కూడా ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వంలో సర్టిఫికెట్లు, పట్టా పుస్తకాలపై ఆయన ఫొటోలు నింపేసిన సంగతి తెలిసిందే. చివరకు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స కోసం చేరిన పేషంట్ల కోసం రూపొందించే చీటీలు, రికార్డుల్లోనూ జగన్‌ బొమ్మలేశారు. భూముల సర్వే అనంతరం రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై కూడా జగన్‌ , రాజశేఖరరె డ్డి ఫొటో, పేరుతో పాటు నవరత్నాల లోగోలు ముద్రించారు. వీటిని చూసి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమకు వారసత్వంగా వచ్చిన భూముల పట్టాలపై జగన్‌ బొమ్మలేమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరయితే ఆ పట్టా పుస్తకాలను తీసుకునేందుకు నిరాకరించారు. మరికొందరు ఆ పుస్తకాలను బహిరంగంగానే చింపేసి తగలబెట్టారు.

చంద్రబాబు ఆదేశించినా...

తమ ప్రభుత్వం వస్తే పాస్‌పుస్తకాలు, ప్రభుత్వ రికార్డులు, సర్టిఫికెట్లపై ఉన్న జగన్‌ బొమ్మలు తొలగిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలు, విద్యార్థులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపై జగన్‌ ఫొటోలు తొలగించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చి ఉంటే వాటి ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఇది జరిగి మూడు నెలలవుతోంది. అయినా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు, సర్టిఫికెట్లపై ఇంకా జగన్‌ బొమ్మలే కనిపిస్తున్నాయి. అంటే..

ముఖ్యమంత్రి ఆదేశాలు ఈ శాఖకు వర్తించడం లేదా? లేక సీఎం ఆదేశాలంటే లెక్కలేక ఇలాంటి పనులు చేస్తున్నారా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జగన్‌ బొమ్మలున్న రికార్డులను వెనక్కి తీసుకోవాలని, ఆ పేరిట పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇవ్వకూడదని సాధారణ పరిపాలన శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. సీఎస్‌ పేరిట ఆదేశాలు ఆయా శాఖలకు వెళ్లాలి. కానీ ఇప్పటిదాకా సీఎస్‌ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిసింది. రె వెన్యూ శాఖ అయినా ఇవ్వాలి. కానీ ఆ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. జగన్‌ ఫొటోలు వద్దని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకొని వాటిని అమలు చేయాలి. కానీ తాజా పరిణామాన్ని పరిశీలిస్తే సమన్వయలోపం కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కనీసం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ అయినా ఈ అంశంపై దృష్టిసారించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Sep 14 , 2024 | 05:23 AM