Share News

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:29 PM

జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్‌ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కనెక్షన్లను నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి

జల్‌ జీవన్‌ లక్ష్యాన్ని సంపూర్తిగా సాధించాలి

కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 10: జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్‌ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కనెక్షన్లను నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా జిల్లాలో అమలవుతున్న శుద్ధ తాగునీటి సరఫరా పనుల పురోగతిపై ఆయా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు, సహాయకులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు వందశాతం పూర్తి లక్ష్యాలను సాధించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో తాగునీటి పథకాల అమలు, పనితీరును మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా తాగునీటి నాణ్యత పరీక్షలను క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహించాలన్నారు. పంచా యతీల్లో క్లోరినేషన్‌ సిస్టమ్‌ను, ఎఫ్‌టీకే పనితీరు, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ సిస్టమ్‌ ప్రణాళికను పటిష్టంగా అమలు పరచాలని సూచించారు. పీడబ్ల్యుఎస్‌, ఎంపీడబ్ల్యూఎస్‌, సీపీడబ్ల్యూఎస్‌ స్కీముల నిర్వహణను పటిష్టం చేయాలన్నారు. తాగునీటి కొళాయి కనెక్షన్ల పైపులైన్లలో లీకేజీలు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వీటిపై సచివాలయం పరిధిలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, సీపీవో వెంకట్రావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ ఏడుకొండలు, ఈఈలు, డీఈలతో పాటు అన్ని మండలాల ఏఈఈలు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:29 PM