Share News

Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్‌షిప్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:16 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రసాదరెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. వైసీపీకి విశాఖలో ప్రధాన కార్యకర్తగా పనిచేసిన ఆయన యూనివర్సిటీని పూర్తిగా ఆ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని ప్రసాదరెడ్డి ఏకంగా తెలుగు ప్రొఫెసర్‌ను చేసేశారు. ఏయూలో

Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్‌షిప్‌

తెలుగు పరిశోధకులకు గైడ్‌గా నియామకం

మూడేళ్లనాడే ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి

ఆమె అమరావతిలో.. విద్యార్థులు విశాఖలో

ఇదీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి బాగోతం

టీడీఆర్‌ హబ్‌ కేంద్రంగా అడ్డగోలు వ్యవహారాలు

విశాఖపట్నం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రసాదరెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. వైసీపీకి విశాఖలో ప్రధాన కార్యకర్తగా పనిచేసిన ఆయన యూనివర్సిటీని పూర్తిగా ఆ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని ప్రసాదరెడ్డి ఏకంగా తెలుగు ప్రొఫెసర్‌ను చేసేశారు. ఏయూలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీఆర్‌ (ట్రాన్స్‌ డిసిప్లినరీ రిసెర్చ్‌) హబ్‌లో తెలుగు ప్రొఫెసర్‌ హోదా ఇచ్చి పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకురాలి (గైడ్‌)గా నియమించారు. మూడేళ్ల క్రితమే ఈ నియామకం జరిగింది. వివిధ సంస్థల్లో విధులు (ఉద్యోగాలు) నిర్వహిస్తున్న వారికి పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించేందుకు ఈ టీడీఆర్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేని జేమ్స్‌ స్టీఫెన్‌ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ టీడీఆర్‌ హబ్‌కు డీన్‌ని చేశారు. కాగా, లక్ష్మీపార్వతి విజయవాడలో ఉంటారు. పీహెచ్‌డీ చేసే పరిశోధకులంతా విశాఖపట్నానికి చెందినవారు. అక్కడ ఉండే ఆమె ఇక్కడి వారిని ఎలా గైడ్‌ చేస్తారనే విషయన్ని పరిశీలించకుండానే ఆమెను నియమించారు. అంతేకాదు, పది మంది పరిశోధకులకు కూడా ఆమెను గైడ్‌ను చేశారు.

అర్హత ఉందా?

పీహెచ్‌డీ చేసే పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే ప్రొఫెసర్‌.. పీజీ విద్యార్థులకు పాఠాలు బోధించి ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. కనీసం ఒక్కరికైనా పీహెచ్‌డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి. ఇవేమీ లేకుండానే లక్ష్మీపార్వతిని గైడ్‌గా నియమించారు. అంతేకాదు, ఆమెకు ‘గైడ్‌ షిప్‌’ కింద కొంత మొత్తం కూడా ఇప్పించారు. అయితే, ఆమె విశాఖపట్నం ఎప్పుడు వస్తారు?, మేము ఎప్పుడు ఆమె సలహాలు తీసుకుంటామంటూ పరిశోధనా విద్యార్థులు వాపోతున్నారు. దీంతో ‘‘మీకు అలాంటి భయం అవసరం లేదు. అంతా మేం చూసుకుంటాం’’ అని డీన్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ భరోసా ఇవ్వడం విశేషం. వైసీపీకి అన్ని రకాలుగా సహకరించిన ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులకు అవసరమైన పీహెచ్‌డీలు ప్రదానం చేసేందుకే ఈ టీడీఆర్‌ హబ్‌ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీ’ అనే కొత్త పదం వాడుకలోకి తెచ్చారు. ఈ హబ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తోంది. ఇక్కడ సుమారు 150 మందికిపైగా రీసెర్చి చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఇలా అన్ని విభాగాల వారున్నారు. సాధారణంగా ఇలాంటి రీసెర్చి చేసేవారు సంబంధిత విభాగంతో అనుసంధానమై ఉండాలి. పరీక్షల నిర్వహణ కూడా ఆయా విభాగాల ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. కానీ, టీడీఆర్‌ హబ్‌ డీన్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్‌ స్టీఫెన్‌ ఈ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. లక్ష్మీపార్వతిలాగే ప్రైవేటుకు కాలేజీల్లో పనిచేస్తున్న వారిని తీసుకువచ్చి ప్రొఫెసర్లుగా నియమించి.. ‘గైడ్లు’ అని ప్రచారం చేసి వారికి పరిశోధకులను అప్పగించారు. అలా రీసెర్చి చేస్తున్న వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి, వారే వాటిని దిద్ది మార్కులు వేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ డీవీఆర్‌ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పరీక్షలను తాము గుర్తించడం లేదన్నారు.

విచారణ చేయిస్తారా?

ఇప్పుడు కూడా వారికి పరీక్షలు నిర్వహించాల్సిన సమయం వచ్చింది. దీనికి వైస్‌ చాన్సలర్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వీసీగా ఎవరూ లేకపోవడంతో సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీఆర్‌ రాజు పరీక్షల నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే, టీడీఆర్‌ హబ్‌లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. టీడీఆర్‌ హబ్‌లో అడ్డగోలు వ్యవహారాలపై హిందీ విభాగాధిపతి సత్యనారాయణ ఏ డాది క్రితమే విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 11 , 2024 | 08:16 AM