Share News

అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా?

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:46 AM

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలుంటే వదిలేసి ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తానని చెబుతున్న జగన్‌ డైవర్షన్‌ డ్రామాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు.

అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా?

జగన్‌వి డైవర్షన్‌ డ్రామాలు: టీడీపీపీ

శ్వేతపత్రాల్లో తప్పులు బయటపడతాయనే ధర్నా బాట

పార్లమెంటులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తాం

ఐదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని దేశానికి వివరిస్తాం: లావు

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలుంటే వదిలేసి ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తానని చెబుతున్న జగన్‌ డైవర్షన్‌ డ్రామాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇప్పటికే అమరావతి, పోలవరం, విద్యుత్‌, సహజ వనరుల దోపిడీపై నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతలు, పరిశ్రమలతో పాటు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు ప్రవేశపెడతారని.. వీటిపై అక్కడ చర్చించకుండా హస్తిన వస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సోమవారం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారమిక్కడ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ తరఫున రాయలు హాజరయ్యారు. పార్లమెంటులో ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తామని తెలిపారు. ఐదేళ్ల జగన్‌ జమానాలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని లోక్‌సభ వేదికగా దేశానికి వివరిస్తామన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం చేయూతనివ్వాలని కోరారు. సభలో తమ పార్టీ ఎంపీల్లో ఎక్కువ మంది యువత, కొత్తవారు ఉన్నారని, వారికి మాట్లాడేందుకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష భేటీ అనంతరం సహచర ఎంపీ జీఎం హరీశ్‌ బాలయోగితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శ్వేతపత్రాలు, రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తే ఆంధ్ర ప్రజలు వింటారని.. కానీ జగన్‌ హస్తిన వచ్చి నాటకాలు ఆడతామంటే విశ్వసించరని స్పష్టం చేశారు. ఐదేళ్లలో చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయంతో.. వాటి నుంచి తప్పించుకోవడానికే జగ న్‌ ఢిల్లీలో డ్రామాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అభివృద్థిని అడ్డుకోవడం, పొలిటికల్‌ డ్రామాలు ఆడడమే వైసీపీ పనని మండిపడ్డారు.

విధ్వంసం గురించి అందరికీ తెలియాలి..

గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని.. ఇది తెలిస్తే అన్ని పార్టీలూ తమను సమర్థిస్తాయని రాయలు చెప్పారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాము సుముఖంగా లేమని చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని, రైలు సర్వీసులు పునరుద్ధరించాలని కోరారు. ఇంటింటికీ కుళాయి నీళ్ల పథకం కూడా అలాగే తయారైందని, ఆ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు.

ప్రత్యేక హోదా ప్రస్తావించాలి: బాలశౌరి

ఏపీలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, కొందరు ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన లోక్‌సభా పక్ష నేత వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు. ఆదివారమిక్కడ అఖిలపక్ష సమావేశం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని, అంతేతప్ప అఖిలపక్ష సమావేశంలో అడిగితే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పార్లమెంటులో సమావేశాల్లో ప్రతి ఒక్కరికీ తగినంత సమయం కేటాయించాలని కోరానన్నారు. జనసేన వందశాతం స్ర్టైక్‌ రేట్‌ కలిగిన పార్టీ అని ఆయన గుర్తుచేశారు.

ఎయిమ్స్‌ వైపు ఎంపీల చూపు

ముగ్గురికి నామినేటెడ్‌ పదవులకు అవకాశం

గుంటూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని ఎయిమ్స్‌ బోర్డు మెంబర్‌ పదవులపై రాష్ట్ర ఎంపీలు దృష్టి సారించారు. ఈ బోర్డులో మొత్తం 17 మంది సభ్యులుంటారు. ఇందులో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా ఎవరు ఉంటే వారు సభ్యునిగా కొనసాగుతారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరక్టర్‌ జనరల్‌, మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహరిస్తారు. కాగా రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలను బోర్డు మెంబర్లుగా నియమిస్తారు. ఇప్పటి వరకు ఈ బోర్డులో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్‌, వైసీపీ మాజీ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి బోర్డు మెంబర్లుగా కొనసాగారు. ఈ ముగ్గురు తప్పుకోవడంతో మంగళగిరి ఎయిమ్స్‌ బోర్డులో ముగ్గురు ఎంపీలను నియమించుకోవాల్సి ఉంది. రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు ఆ పదవులపై దృష్టి సారించారు. మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి బీజేపీకి దక్కనున్నాయి.

Updated Date - Jul 22 , 2024 | 04:46 AM