మహీ... మనోడే!
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:03 AM
వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవరెడ్డి! ఈ పేరు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నట్లు గుర్తుందా? పోనీ... ‘యాత్ర-2’ దర్శక, నిర్మాత మహీ వి.రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియకపోయి ఉండొచ్చుకానీ...
హార్సిలీహిల్స్కు చేరిన ‘యాత్ర’లో కొత్త కోణం
అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి
తల్లిది పులివెందుల.. తండ్రిది పుంగనూరు
2019 ఎన్నికల ముందే జగన్తో డీల్
‘యాత్ర’కు దర్శకత్వం.. ప్రచారానికి పంచ్ డైలాగులు
‘నేను విన్నానూ... నేను ఉన్నానూ’ అనిపించింది ఆయనే
ఇప్పుడు ‘యాత్ర-2’ దర్శకత్వంతోపాటు నిర్మాణం కూడా
వచ్చే ఎన్నికలకూ సేవ అందించేలా ‘ప్యాకేజీ’
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవరెడ్డి! ఈ పేరు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నట్లు గుర్తుందా? పోనీ... ‘యాత్ర-2’ దర్శక, నిర్మాత మహీ వి.రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియకపోయి ఉండొచ్చుకానీ... ‘హార్సిలీహిల్స్’ కథ విన్నాక కచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే... మహీ వి.రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి! అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీహిల్స్లో ‘మినీ సినీ స్టూడియో’ పేరిట రెండెకరాలు కట్టబెడుతున్నది ఆయనకే! అసలు ఎవరీ ‘మహీ వి.రాఘవ’ అని ఆరా తీస్తే... ఆయన ఇంకెవరో కాదని, ముఖ్యమంత్రి జగన్కు ‘మనోడే’ అని తెలిసింది. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. మహీ తండ్రిది పుంగనూరు నియోజకవర్గం సదుం. తల్లిది పులివెందుల. ఎటు చూసినా మనోడి కిందే లెక్కే. సినీ పరిశ్రమలోకి రాకముందు, ఆ తర్వాత కూడా ప్రతి ఏటా వేసవిలో ఆయన హర్సిలీహిల్స్కు వెళ్లే వారు. కొద్ది రోజులు బస చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఆ ప్రదేశంలో తనకూ కొంత స్థలం ఉంటే ఎంత హాయో అని అప్పుడే కలలు కనేవారు. ఆయన చిన్నప్పటి నుంచి కంటున్న కల ఇప్పటికి సాకారమవుతోంది. జగన్తో మహీకి ‘క్విడ్ ప్రోకో’ తరహా డీల్ కుదిరింది. వీరిది ‘యాత్ర-2’తో మొదలైన బంధం కాదు. 2019లోనే ఇది మొదలైంది. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో... జగన్ను, వైఎ్సనూ కీర్తిస్తూ తీసిన ‘యాత్ర’ చిత్రానికి మహీ దర్శకత్వం వహించారు. జగన్ ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగులను కూడా రాసిచ్చారు. ‘నేను విన్నానూ.. నేను ఉన్నానూ’ అంటూ జగన్ తీసిన దీర్ఘాలు గుర్తున్నాయి కదా! ఆ మాటలు మహీ వి.రాఘ వ సృష్టించినవే. ఇప్పుడు.. 2024 ఎన్నికల ముందు ‘యాత్ర-2’ పేరుతో మరో సినిమా తీశారు. ‘యాత్ర’కు మహీ దర్శకుడు మాత్రమే! అచ్చంగా జగన్ను కీర్తిస్తూ తీసిన సీక్వెల్ సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. యాత్ర-2 ప్రకటన, షూటింగ్, విడుదల ఒక అంకం! హార్సిలీహిల్స్లో పదెకరాల స్థలం కోసం నేరుగా సీఎం జగన్కు దరఖాస్తు, దీనిపై ఫైల్ పెట్టాలంటూ సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశాలు, జిల్లా కలెక్టర్కు లేఖ, అక్కడి తహసీల్దార్కు ఆదేశాలు, శుక్రవారం స్థల పరిశీలన... ఇది మరో అంకం! ఇవి రెండూ ఒకేకాలంలో ముందుకు కదిలాయి. యా త్ర-2కు ముందు దరఖాస్తు పెట్టుకోగా... సినిమా విడుదలైన శుక్రవారమే మదనపల్లె ఆర్డీవో ఈ స్థలాన్ని పరిశీలించి, లైన్ క్లియర్ చేశారు. ఈ రెండెకరాలు తీసుకున్నందుకు.. 2029 ఎన్నికల్లోనూ మహీ వైసీపీకి తన సేవలు అందించాల్సి ఉంటుందని సమాచారం!