Nara Lokesh : కూటమి నేతగా బాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:00 AM
టీడీపీ అధినేత చంద్రబాబును తమ కూటమి శాసనసభాపక్షం నేతగా టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ఎన్నుకున్న మూడు పార్టీల ఎమ్మెల్యేలు
పవన్ ప్రతిపాదన.. పురందేశ్వరి సమర్థన
గవర్నర్తో లాంఛనంగా కూటమి నేతల భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వాన లేఖను వారికి అందించిన అబ్దుల్ నజీర్
అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబును తమ కూటమి శాసనసభాపక్షం నేతగా టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ హాలులో ఈ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమర్థించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను ఆయన వారికి అందజేశారు. ఆయన పిలుపు మేరకు సాయంత్రం చంద్రబాబు రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కూటమి భారీ విజయంతో పాటు మంత్రివర్గం కూర్పుపై చర్చించారు. అంతకుముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ ‘ఏ’ కన్వెషన్లోనే జరిగిన ఈ భేటీలో అచ్చెన్నాయుడు ఆయన పేరును ప్రతిపాదించగా.. టీడీపీ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా అద్భుత విజయం సాధించామని, దీనికి చంద్రబాబు, ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, పురందేశ్వరి కారకులంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.