Share News

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

ABN , Publish Date - May 12 , 2024 | 04:26 AM

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటెయ్యొద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. జగన్‌ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు.

Pawan Kalyan :  వైసీపీకి ఓటేయొద్దు

వేస్తే మళ్లీ గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే

జగన్‌ దేశం దాటాలంటే కోర్టు అనుమతి

కావాలి.. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రా!

నా నేల రౌడీల చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేదు

మార్పు కోసం కూటమికి ఓటడుగుతున్నా

కాకినాడ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటెయ్యొద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. జగన్‌ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు. దేశం దాటి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి కోరే వ్యక్తి మనకు ముఖ్యమంత్రా..? అని ప్రశ్నించారు. ప్రజల పాసు పుస్తకాలు, భూముల సర్వే రాళ్లపై.. 33 కేసులున్న వ్యక్తి ఫొటో ఎందుకని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడంటే ఆ తప్పు ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ గూండా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజైన శనివారం పవన్‌ కల్యాణ్‌ కాకినాడ సభలో ప్రసంగించారు. అంతకుముందు ఉదయం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. సినీనటుడు రామ్‌చరణ్‌తో కలిసి ప్రజలకు అభివాదం తెలిపారు. కాకినాడ బహిరంగ సభలో పవన్‌ ఇంకా ఏమన్నారంటే..

రౌడీల చేతుల్లోకి వెళ్లనివ్వను..

సోమవారం జరిగే ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మలుపుతిప్పేవి. అందుకే ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటేయాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది. నేను ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని. మొన్న ఎన్నికల్లో ఓడినా నిలబడి ఉన్నానంటే దానికి కారణం.. నా నేల రౌడీల చేతుల్లోకి వెళ్లడం నాకిష్టం లేకపోవడమే. రాజకీయ నేరస్తులు కూర్చోబెట్టి మనకు సలహాలు చెప్పేవారయ్యారు. దేశం విడిచి వెళ్లాలంటే న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రా..? 33 కేసులున్న వ్యక్తి ఫొటో ప్రజల పాసు పుస్తకాలు, సర్వేరాళ్లపై ఉండాలా..? భూహక్కు చట్టంతో సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజల ఆస్తులను లాగేసుకోవాలనుకుంటున్నారు. అది అమలైతే అందరి ఆస్తులూ గాల్లో దీపాల్లా మారుతాయి. అందుకే వైసీపీకి ఓటెయ్యొద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మళ్లీ జగన్‌ వస్తారు. అందుకే అందరూ బలంగా నిలబడి వైసీపీని మట్టిలో కలపాలి. ప్రతి ఒక్కరు తమ కోపాన్ని ఓటు రూపంలో చూపాలి.


ఇంకెంతకాలం భయపడి పారిపోతాం..

ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయండి. ఐదేళ్లు జగన్‌ పాలన చూడండి. నిరంతరం జనంలో ఉండి పోరాడుతున్న నన్ను చూడండి. నాకు ఓటు వేయకపోయినా.. అధికారం లేకపోయినా నేనేం చచ్చిపోను. కానీ జనం బాధలు నన్ను రోడ్డుపైకి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాయి. మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు కోసం. నేనేమీ గూండాలకు భయపడే వ్యక్తిని కాదు. అలాంటి వాడినే అయితే పార్టీ పెట్టే వాడినే కాదు. 2009లో అప్పటి సీఎం వైఎస్‌ బెదిరించినా భయపడలేదు. నా శ్వాస ఉన్నంతవరకు జనసేన నుంచి రెండు తెలుగు రాష్ట్రాల కోసం నిలబడతా. గత ఎన్నికలప్పుడు జగన్‌ అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదమో అందరికీ చెప్పాను. ఎవరూ వినలేదు. సమాజం భయం గుప్పిట్లో ఇరుక్కుపోయింది. అందుకే భయం వదలండి. జగన్‌ను చూసి ఇంకెంతకాలం భయపడి పారిపోతాం. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈసారి ఓటుతో కూటమిని గెలిపించాలి.

అన్నింటా పాదముద్రే..

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతి భయంకరంగా ఉంది. గూండాగిరీతో అందరినీ బెదిరిస్తున్నాడు. పేకాట, గంజాయి మాఫియా నడిపిస్తున్నాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మట్టి, గ్రావెల్‌, సహజ వనరులపై ప్రతి దానిపైనా అతడి అవినీతి పాదముద్ర ఉంది. అడ్డగోలుగా సంపాదించాడు. ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేకు భయపడాలా. నాకున్న బలానికి ద్వారంపూడిని నేలపై కూర్చోబెట్టి మోకాళ్లపై నడిపించగలను. కూటమి రాగానే కాకినాడలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తాం. వేషాలేసే గూండాలను కిందపెట్టి నడిపిస్తా. మక్కెలు విరగ్గొడతా. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తా.

Updated Date - May 12 , 2024 | 04:26 AM