ఇండియా ట్రెండ్స్లో ‘ప్రజాగళానికి’ ప్రథమ స్థానం
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:22 AM
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభ దేశవ్యాప్తంగా ‘ఎక్స్’లో వైరల్ అయ్యింది.
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభ దేశవ్యాప్తంగా ‘ఎక్స్’లో వైరల్ అయ్యింది. ఇండియా ట్రెండ్స్లో ‘ప్రజాగళం’ హ్యాష్ ట్యాగ్తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆహ్వానిస్తూ, వేల సంఖ్యలో ట్వీట్లతో నెటిజన్లు మద్దతు తెలిపారు. ఏపీ వెల్కం టూ మోదీ, చంద్రబాబు-పవన్కల్యాణ్- నరేంద్రమోదీ ఎట్దీ రేట్ ఆఫ్ ప్రజాగళం, టీడీపీ-జేఎ్సపీ- -బీజేపీ విన్నింగ్ హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండింగ్లో నిలిచాయి.
మార్మోగిన అమరావతి నినాదం
అమరావతి రైతుల విజ్ఞప్తి మేరకు ప్రజాగళం సభలో రైతుల కోసం మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు. పెద్ద సంఖ్యలో హాజరైన అమరావతి రైతులు, రాజధాని మహిళలు ‘జయహో అమరావతి, సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ నినాదాలతో హోరెత్తించారు.
ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటిన ప్రజాగళం
మూడు పార్టీల ఐక్యతను ఆంధ్ర జనం బలంగా కోరుకుంటున్న విషయం సభలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రతినిధులుగా తరలివచ్చిన లక్షలాది మంది జనం.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత పట్ల సంఘీభావంగా నినాదాలు చేశారు. మూడు పార్టీలూ ఈ ఐక్యతను దీర్ఘకాలం కొనసాగించాలని బలంగా కోరుకున్నారు. నేతల సమన్వయం అక్కడికే పరిమితం కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా స్పష్టంగా కనిపించింది. మూడు పార్టీల జెండాలు చేతబూని ప్రధానికి స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కూటమి స్ఫూర్తిని చాటారు. వేదిక మీద కూడా నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సమన్వయంతో వ్యవహరించారు.