యుద్ధానికి సిద్ధంకండి!
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:22 AM
‘మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికల యుద్ధానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఇది మా కుంటుంబం కోసం కాదు. మీ కోసం. మన రాష్ట్రం కోసం’ అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
మా కోసం కాదు.. మీ కోసం.. రాష్ట్రం కోసం
ఓటు వేసేందుకు ఎవరికీ భయపడొద్దు
నారా భువనేశ్వరి పిలుపు
సాలూరులో ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రం ప్రారంభం
సాలూరు, ఫిబ్రవరి 27: ‘మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికల యుద్ధానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఇది మా కుంటుంబం కోసం కాదు. మీ కోసం. మన రాష్ట్రం కోసం’ అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం ఆమె పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఓటు వేయడానికి వెనుకడుగు వేయవద్దని, ఎవరికీ భయపడవద్దని పిలుపునిచ్చారు. ఆరోజు ధైర్యం చేసి అందరం మరో పది మందిని తీసుకుని వెళ్లి ఓటు వేయాలని కోరారు. కార్యకర్తలందరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని ఉచిత ఆరోగ్య క్లినిక్ను ఏర్పాటు చేశామన్నారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు అని నమ్మిన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అయన పేరు మీదుగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ద్వారా 12,900 ఉచిత మెడికల్ క్యాంప్లు నిర్వహించినట్లు చెప్పారు. 19.43 లక్షల మందికి రూ.20 కోట్ల విలువైన మందులు ఇచ్చామన్నారు. మూడు బ్లడ్బ్యాంక్ల ద్వారా ఎనిమిది లక్షల మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలను ట్రస్ట్ కాపాడినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సంజీవని ద్వారా 67,104 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.