ఏఎన్యూలో వైఎస్ విగ్రహం తొలగింపు
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:21 AM
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ)లో విద్యార్థుల ఆందోళనతో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు.
విద్యార్థి సంఘాల ఆందోళనతో చర్యలు
పెదకాకాని, జూన్ 10: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ)లో విద్యార్థుల ఆందోళనతో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. సోమవారం అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించాలని ఆందోళన చేపట్టారు. వర్సిటీలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయటం తగదని, వైఎస్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో వీసీ రాజశేఖర్ నాకు కొంత సమయం కావాలని, ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విగ్రహం తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం వీసీ రాజశేఖర్ వర్సిటీ నుంచి వెళ్లిపోయారు. సాయంత్రానికి వర్సిటీ ఇంజనీరింగ్ అధికారులు జేసీబీ తీసుకొచ్చి వైఎస్ విగ్రహాన్ని తొలగించారు.