డీహైడ్రేషన్ యూనిట్ను తొలగించండి
ABN , Publish Date - Mar 05 , 2024 | 12:14 AM
ప్రజల అనారోగ్యాలకు కారణం అవుతున్న ప్రూట్స్ అండ్ విజిటబుల్స్ సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ను తొలగించాలని పెద్దనేలటూరు గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శికి గ్రామస్థుల వినతి
అనుమతులు ఉన్నది అనుమానమే
గోనెగండ్ల, మార్చి 4: ప్రజల అనారోగ్యాలకు కారణం అవుతున్న ప్రూట్స్ అండ్ విజిటబుల్స్ సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ను తొలగించాలని పెద్దనేలటూరు గ్రామస్థులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామస్థులు సుభాన్, చిన్ననరసింహులు, ఖాజా, శ్రీనివాసులు, షఫీ బాషా తో పాటు మరో 25 మంది పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మూడు నెలలు నుంచి గ్రామంలోని వీధుల్లో కొందరు వ్యక్తులు కొత్తగా ఫ్రూట్స్ అండ్ విజిటబుల్స్ సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ పేరుతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనే సంస్థ వారు మిషనరీలతో ఉల్లి, టమోటా, ఆలు వంటి కూరగాయలను కట్టింగ్ చేసి వీటిని మిషనరీ ద్వారా ఎండ బెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇలాంటి డీహైడ్రేషన్ మిషనరీ గ్రామ శివారులో ఉండాలి కాని గ్రామ వీధుల్లో నివాసాల పక్కన ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. మిషనరీల వల్ల దుర్గంధం రావడంతో పిల్లలకు జ్వరాలు, శ్వాస ఆగిపోవడం, కళ్లు మంటలు రావడం, ముసలివారికి అలర్జి, దగ్గు, ఆయాసం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వ్యర్థల వల్ల భరించలేని దుర్గంధం వస్తోందన్నారు. ఈ మిషనరీలకు గ్రామ పంచాయతీ, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అని అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. లేక పోతే గ్రామ పెద్దలతో కలసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.