Share News

విశాఖలో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:37 AM

రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు.

విశాఖలో వైసీపీకి షాక్‌

12 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు అవుట్‌

ఏడుగురు టీడీపీలోకి, ఐదుగురు జనసేనలోకి..త్వరలో మరో ఆరుగురు చేరే అవకాశం!

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఆదివారమిక్కడ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరుల సమక్షంలో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు సారిపల్లి గోవింద, కంపా హనోక్‌, బి.నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఇల్లపు వరలక్ష్మి, లొడగల అప్పారావు, కోడూరు అప్పలరత్నం టీడీపీలో చేరారు. వారికి నేతలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. మరో ఐదుగురు కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, పెద్దింటి ఉషశ్రీ, కంటిపాముల కామేశ్వరి, పి.పూర్ణశ్రీ, బి.సూర్యకుమారి జనసేనలో చేరారు.

వారికి త్వరలో విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తారని వంశీకృష్ణ శ్రీనివాస్‌ తెలిపారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లకు ప్రస్తుతం 97 మంది ఉన్నారు. 12 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరడంతో వైసీపీ బలం 56 నుంచి 44కి పడిపోయింది. ఇదే సమయంలో టీడీపీ బలం 40కి, జనసేన 10కి పెరిగింది. బీజేపీకి ఒక కార్పొరేటర్‌ ఉన్నారు. సీపీఐ, సీపీఎంనుంచీ చెరొకరు ఉన్నారు. మేయర్‌ పదవి చేపట్టాలంటే 49 మంది కార్పొరేటర్లు ఉండాలి. టీడీపీ కూటమికి ఇప్పుడు 51 మంది ఉన్నారు. మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకో ఆరుగురు కార్పొరేటర్లు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఆదివారం 20 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరేందుకు సిద్ధంగా.. వీరిలో 8 మందిపై స్థానిక టీడీపీ, జనసేన శ్రేణులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. వారి వల్ల పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పుడు వారిని చేర్చుకుంటే తీవ్ర అసంతృప్తికి గురవుతారని అడ్డుకున్నట్లు సమాచారం.

Updated Date - Jul 22 , 2024 | 09:15 AM