‘గుర్ల’పై ప్రత్యేక విచారణ
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:16 AM
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు ప్రబలడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని నిర్ణయించింది.
స్పెషల్ సీఎస్ విజయానంద్కు బాధ్యతలు
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు ప్రబలడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంకోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించి డయేరియా ప్రబలడానికి కారణాలను తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
కొత్త కేసులు నమోదు కాలేదు..
కాగా.. గుర్లలో కొత్తగా డయేరియా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ కార్యాలయం తెలిపింది. ఆది, సోమవారాల్లో ఒక్క కేసు కూడా వెలుగులోకి రాలేదని వెల్లడించింది. 120 మంది వైద్య సిబ్బందిని గుర్ల గ్రామానికి తరలించామని, వారంతా మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది.