విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:52 AM
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ హెచ్చరించారు.
ఆత్మకూరు రూరల్, సెప్టెంబరు 3: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బైర్లూటి పీహెచసీ వైద్యాధికారులు గోపాల్, పవనకుమార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశా డే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, ఆశాలకు పలు సూచనలు చేశారు. వేంపెంట గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృత్యువాత పడిన సంఘటన పునరావృతం కాకుండా గ్రామాలను వైద్యసిబ్బంది, ఆశా వర్కర్లు ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆశాలు పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమన్వయంతో సీజనల్ వ్యాఽధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని పంచాయతీల్లో డ్రైనేజీ మురికి గుంటలు శుభ్రం చేయించడం, రహదారులపై నిలువ నీరు నిలువ ఉన్న చోట బ్లీచింగ్ చేయించడం, తాగునీటి ట్యాంకుల క్లోరినేషన వంటి చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేసి మాతృ మరణాలు సంభవించకుండా ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రమణమ్మ,సీహెచవో ఖుద్దూస్ బాషా ఉన్నారు.